[2] ఈ గ్రంథం (అల్లాహ్ గ్రంథం అన్న విషయం) లో ఎంతమాత్రం సందేహం లేదు. భయభక్తులు కలవారికి ఇది సన్మార్గం చూపుతుంది
[3] వారు గోప్యమైన విషయాలను విశ్వసిస్తారు, నమాజును నెలకొల్పుతారు. ఇంకా మేము ప్రసాదించిన దానిలో (సంపదలో) నుంచి ఖర్చుపెడతారు
[4] మేము నీ వైపుకు (అంటే ప్రవక్త వైపుకు) అవతరింపజేసిన దానినీ, నీకు పూర్వం అవతరింపజేసిన వాటినీ వారు విశ్వసి స్తారు. పరలోకం పట్ల కూడా వారు దృఢనమ్మకం కలిగిఉంటారు
[5] ఇలాంటి వారే తమ ప్రభువు తరఫు నుంచి వచ్చిన సన్మార్గాన ఉన్నారు. సాఫల్యాన్ని పొందేవారు వీరే
[6] అవిశ్వాసులను నీవు భయపెట్టినా, భయపెట్టకపోయినా ఒకటే. ఇక వారు విశ్వసించరు
[7] అల్లాహ్ వారి హృదయాలపై,వారి చెవులపై ముద్రవేశాడు. వారి కళ్ళపై పొరవుంది. ఇంకా వారికి మహా (ఘోరమైన) శిక్ష వుంది
[8] మేము అల్లాహ్ పట్ల, అంతిమదినం పట్ల విశ్వాసం కలిగి ఉన్నామని కొందరంటున్నారు. కాని యదార్థానికి వారు విశ్వసించినవారు కారు
[9] వారు అల్లాహ్ను, విశ్వాసులనూ మోసపుచ్చుతున్నారు. అయితే వాస్తవానికి వారు స్వయంగా – తమను తామే మోసపుచ్చుకుంటున్నారు. కాని ఈ విషయాన్ని వారు గ్రహించటం లేదు
[10] వారి హృదయాలలో రోగం ఉంది. ఆ రోగాన్ని అల్లాహ్ మరింతగా పెంచాడు. ఇంకా, వారు చెప్పే అబద్ధం మూలంగా వారి కొరకు వ్యధాభరితమయిన శిక్ష ఉంది
[11] “భూమిలో కల్లోలాన్ని రేకెత్తించకండి” అని వారితో అన్నప్పుడల్లా, “మేము దిద్దుబాటుకు ప్రయత్నించేవారం మాత్రమే” అని వారు సమాధానమిస్తారు
[12] జాగ్రత్త! నిజానికి కల్లోల జనకులు వీరే. కాని వారికి ఆ విషయం తెలియటం లేదు
[13] “ఇతరులు (అంటే ప్రవక్త ప్రియ సహచరులు) విశ్వసించినట్లే మీరూ విశ్వసించండి” అని వారితో చెప్పినప్పుడు, “మూర్ఖ జనులు విశ్వసించినట్లుగా మేము విశ్వసించాలా?” అని వారు (ఎదురు) ప్రశ్న వేస్తారు. తస్మాత్! ముమ్మాటికీ వీరే మూర్ఖులు. కాని ఆ సంగతి వీరికి తెలియటం లేదు
[14] విశ్వాసులను కలుసుకున్నప్పుడు వారు,”మేమూ విశ్వసించిన వారమే” అని అంటారు. కాని తమ షైతానుల (అంటే తమ పెద్దల లేక సర్దారుల) వద్దకు పోయినప్పుడు, “మేము మీతోనే ఉన్నామండీ. కాకపోతే వాళ్ళతో పరిహాసమాడుతున్నామంతే” అని పలుకుతారు
[15] అల్లాహ్ కూడా వారితో పరిహాసమాడుతున్నాడు. వారి తలబిరుసుతనాన్ని మరింత అధికం చేస్తున్నాడు. ఫలితంగా వారు అంధులై గమ్యరహితంగా తిరుగుతూపోతున్నారు
[16] అపమార్గాన్ని సన్మార్గానికి బదులుగా కొనితెచ్చుకున్నవారు వీరే. అందుచేత వారి ఈ వర్తకం వారికి లాభదాయకమూ కాలేదు, వారు సన్మార్గానికి నోచుకోనూ లేదు
[17] వారి ఉపమానం నిప్పు రాజేసిన వ్యక్తి లాంటిది. నిప్పు రాజేసినంతనే పరిసరాల్లోని వస్తువులన్నీ వెలుగులోనికి వచ్చాయి. అంతలోనే అల్లాహ్ వారి వెలుగును హరించి, వారిని కారు చీకట్లలో, ఏమీ కానరాని స్థితిలో వదిలేశాడు
[18] వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు. ఇక వారు (సరైన దారికి) మరలిరారు
[19] లేదా (వారి ఉపమానం) ఆకాశం నుంచి కురిసే భారీ వర్షం మాదిరిగా ఉంది – అందులోనూ చిమ్మచీకట్లు, ఉరుములు, మెరుపులు! ఉరుముల గర్జన విని, మృత్యు భయంతో వారు తమ వ్రేళ్ళను తమ చెవులలో దూర్చుకుంటారు. అల్లాహ్ ఈ అవిశ్వాసులను అన్ని వైపుల నుంచీ ముట్టడిస్తాడు
[20] మెరుపులు వారి దృష్టిని ఎగరవేసుకుపోతాయా! అన్నట్టుంది వారి పరిస్థితి. అవి (మెరుపు తీగలు) వెలుగును విరజిమ్మినపుడల్లా వారు అందులో కొంతదూరం నడుస్తారు. తర్వాత వారిపై చీకటి ఆవరించగానే నిలబడిపోతారు. అల్లాహ్యే గనక తలచుకుంటే వారి వినేశక్తినీ, కంటిచూపునూ పోగొట్టేవాడే, నిశ్చయంగా అల్లాహ్ అన్నింటిపై అధికారం గలవాడు
[21] ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి- తద్వారానే మీరు (పాపాల నుండి) సురక్షితంగా ఉంటారు
[22] ఆయనే మీ కోసం భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధినొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్కు భాగస్వాములుగా నిలబెట్టకండి
[23] మేము మా దాసునిపై అవతరింపజేసిన దాని విషయంలో ఒకవేళ మీకేదన్నా అనుమానముంటే, అటువంటిదే ఒక్క సూరానైనా (రచించి) తీసుకురండి. మీరు సత్యవంతులే అయితే (ఈ పని కోసం) అల్లాహ్ను తప్ప మీ సహాయకులందరినీ పిలుచుకోండి
[24] ఒకవేళ మీరు గనక ఈ పని చెయ్యకపోతే- ఎన్నటికీ అది మీ వల్ల కాని పనే- (దీన్ని సత్యమని ఒప్పుకుని) మానవులు,రాళ్ళు ఇంధనం కాగల ఆ అగ్ని నుండి (మిమ్మల్ని మీరు) కాపాడుకోండి. అది సత్య తిరస్కారుల కోసం తయారు చేయబడింది
[25] విశ్వసించి, సత్కార్యాలు చేసే వారికి క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ)వనాల శుభవార్తలను అందజెయ్యి. తినడానికి అక్కడి పండ్లు వారికి ఇవ్వబడినప్పుడల్లా, “ఇలాంటి పండ్లే ఇంతకు మునుపు మాకు ఇవ్వబడినవి” అని వారంటారు. నిజానికి పరస్పరం పోలి వుండే ఫలాలు వారికి ప్రసాదించబడతాయి. వారి కొరకు పరిశుద్ధులైన భార్యలుంటారు. వారు ఈ స్వర్గవనాలలో కలకాలం ఉంటారు
[26] నిశ్చయంగా అల్లాహ్ దేనినీ ఉపమానంగా చెప్పటానికి సిగ్గుపడడు- (కడకు) దోమ అయినాసరే, దానికన్నా అల్పమైన వస్తువు అయినాసరే! విశ్వసించినవారు మాత్రం దీన్ని తమ ప్రభువు తరఫు నుంచి వచ్చిన సత్యమని భావిస్తారు. కాని అవిశ్వాసులు, “ఈ ఉపమానం ద్వారా ఇంతకీ అల్లాహ్ ఏం చెప్పదలచుకుంటున్నాడు?” అని అంటారు. ఈ విధంగా ఆయన దీని ద్వారానే ఎంతో మందిని అపమార్గం పట్టిస్తాడు, మరెంతో మందిని సన్మార్గంపైకి తీసుకువస్తాడు. అయితే దీని ద్వారా ఆయన అపమార్గానికి లోను చేసేది అవిధేయులను మాత్రమే
[27] వీరు ఎలాంటి వారంటే అల్లాహ్తో చేసిన దృఢమైన ప్రమాణాన్ని భంగపరుస్తారు. అల్లాహ్ కలిపి ఉంచమని చెప్పిన వాటిని త్రెంచివేస్తారు. భువిలో చెడుగును వ్యాపింపజేస్తారు. వీరే అసలు నష్టాన్ని పొందేవారు
[28] మీరు అల్లాహ్ యెడల తిరస్కార వైఖరికి ఎలా ఒడిగట్టగలరు? చూడబోతే నిర్జీవులుగా ఉన్న మీకు ఆయనే ప్రాణం పోశాడు. మరి మీ ప్రాణం తీసేవాడూ, తిరిగి మిమ్మల్ని బ్రతికించేవాడు కూడా ఆయనే. ఆ తరువాత మీరు ఆయన వైపుకే మరలించబడతారు
[29] ఆయనే మీ కోసం భూమిలో ఉన్న సమస్త వస్తువులనూ సృష్టించాడు. తరువాత ఆకాశం వైపుకు ధ్యానాన్ని మరల్చి, తగు రీతిలో సప్తాకాశాలను నిర్మించాడు. ఆయన అన్నీ తెలిసినవాడు
[30] “నేను భువిలో ప్రతినిధిని చేయబోతున్నాను” అని నీ ప్రభువు తన దూతలతో అన్నప్పుడు, “భూమిలో కల్లోలాన్ని రేకెత్తించి, రక్తం ప్రవహింపజేసేవాణ్ణి ఎందుకు సృష్టిస్తావు (ప్రభూ)? నిన్ను స్తుతించటానికి, ప్రశంసించటానికి, నీ పవిత్రతను కొనియాడటానికి మేమున్నాము కదా!” అని వారన్నారు. దానికి అల్లాహ్, “నాకు తెలిసినవన్నీ మీకు తెలియవు” అని అన్నాడు
[31] (తరువాత) అల్లాహ్ ఆదంకు అన్ని (వస్తువుల) పేర్లనూ నేర్పి, వాటిని దూతల ముందుంచాడు. “ఒకవేళ మీరు చెప్పేదే నిజమయితే, కాస్త వీటి పేర్లు చెప్పండి?” అన్నాడు
[32] వారంతా ఇలా అన్నారు : “(ఓ అల్లాహ్!) నీవు అత్యంత పవిత్రుడవు. నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు. నిశ్చయంగా అన్నీ తెలిసినవాడవు, వివేకవంతుడవూ నీవే!”
[33] అప్పుడు అల్లాహ్, “ఓ ఆదం! వీటి పేర్లేమిటో నువ్వు తెలుపు” అన్నాడు. ఆయన వాటి పేర్లన్నీ చెప్పేయగానే అల్లాహ్ ఇలా ప్రకటించాడు: “భూమ్యాకాశాలలో గోప్యంగా వున్నవన్నీ నాకు తెలుసనీ, మీరు బహిర్గతం చేసేవీ, దాచి పెట్టేవీ అన్నీ నాకు తెలుసని (ముందే) నేను మీకు చెప్పలేదా?”
[34] “మీరందరూ ఆదం ముందు సాష్టాంగపడండి” అని మేము దూతలను ఆజ్ఞాపించినపుడు ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు మాత్రం తిరస్కరించాడు. అహంకారి అయి, అవిధేయులలో చేరిపోయాడు
[35] (తరువాత) మేము, “ఓ ఆదం! నువ్వూ, నీ భార్య – ఇద్దరూ- స్వర్గంలో ఉండండి, మీరు ఇష్టపడిన చోటు నుంచి స్వేచ్ఛగా తినండి, త్రాగండి. కాని ఈ వృక్షం దరిదాపులకు కూడా పోవద్దు. లేదంటే దుర్మార్గులలో చేరిపోతారు” అని చెప్పాము
[36] కాని షైతాన్ వారిని పెడత్రోవ పట్టించి, అక్కడి నుంచి బయటికి తీసివేయించాడు. మేము వారిని ఇలా ఆదేశించాము: “దిగిపోండి. మీరు ఒండొకరికి శత్రువులు. ఒక నిర్ణీత కాలం వరకు భూమిపైనే ఉండి మీరు లబ్ది పొందవలసి ఉంది.”
[37] అప్పుడు ఆదం (అలైహిస్సలాం) తన ప్రభువు నుంచి కొన్ని మాటలు నేర్చుకుని (పశ్చాత్తాపం చెందారు.) అల్లాహ్ ఆయన పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. నిశ్చయంగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు కూడాను
[38] మేము వారితో అన్నాము: “మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి. నా ఉపదేశం ఎప్పుడు మీ వద్దకు వచ్చినా, దాన్ని అనుసరించే వారికి ఎలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.”
[39] ఎవరయితే దానిని నిరాకరించి, మా ఆయతులను అసత్యాలని త్రోసిపుచ్చుతారో వారే నరకాగ్నిలోకి పోయేవారు. వారందులో కలకాలం పడి ఉంటారు
[40] ఓ ఇస్రాయీలు వంశస్థులారా! నేను మీకు అనుగ్రహించిన భాగ్యాన్ని గురించి కాస్త జ్ఞాపకం చేసుకోండి. మీరు నాతో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి, నేను మీతో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను. మీరు నాకు మాత్రమే భయపడండి
[41] మీ వద్దనున్న గ్రంథాలకు ధృవీకరణగా నేను అవతరింపజేసిన ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ను) విశ్వసించండి. దీని పట్ల అందరికంటే ముందు మీరే తిరస్కారులు కాకండి. ఇంకా నా ఆయతులను కొద్దిపాటి ధరకు అమ్ముకోకండి. నాకు మాత్రమే భయపడండి
[42] సత్యాన్ని అసత్యంతో కలిపి కలగాపులగం చేయకండి. తెలిసి కూడా సత్యాన్ని కప్పిపుచ్చకండి
[43] (ఇస్రాయీలు సంతతి వారలారా!) మీరు నమాజులను నెలకొల్పండి, జకాతును ఇవ్వండి, (నా సన్నిధిలో) రుకూ చేసే వారితోపాటు మీరూ రుకూ చేయండి
[44] ప్రజలకైతే మీరు మంచిని గురించి ఆదేశిస్తారు, కాని మీ స్వయాన్ని మరచిపోతారే?! చూడబోతే మీరు గ్రంథపారాయణం చేస్తారాయె. మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా
[45] మీరు ఓర్పు ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థించండి. నిశ్చయంగా ఇది కష్టమయిన పనే. కాని (అల్లాహ్కు) భయపడేవారికి (ఇది సులువైనపని)
[46] (ఎందుకంటే) ఎట్టకేలకు తాము తమ ప్రభువును కలుసుకోవాల్సి ఉందనీ, ఆయన వైపునకే మరలిపోవలసి ఉందనీ వారు నమ్ముతారు
[47] ఓ ఇస్రాయీలు (యాఖూబు) సంతతి వారలారా! నేను మీపై కురిపించిన అనుగ్రహాన్నీ, (నాటి) సమస్త లోకవాసులపై మీకు ఇచ్చిన ప్రాధాన్యతను గురించి (కాస్త) నెమరు వేసుకోండి
[48] ఎవరూ ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేని, ఎవరి సిఫారసూ స్వీకరించబడని, ఎవరి వద్ద కూడా పరిహారం తీసుకోబడని, ఎలాంటి సాయం అందజేయబడని ఆ దినానికి భయపడండి
[49] (ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి) ఫిరౌను మనుషుల బారి నుండి మేము మీకు విముక్తి నొసగాము. వారు మిమ్మల్ని దారుణంగా వేధించేవారు. మీ కొడుకులను చంపివేసి, కూతుళ్ళను మాత్రం విడిచి పెట్టేవాళ్ళు. ఈ విముక్తి నొసగటంలో మీ ప్రభువు తరఫునుండి మీకు గొప్ప పరీక్ష ఉండినది
[50] అప్పుడు మేము మీ కోసం సముద్రాన్ని చీల్చి, మిమ్మల్ని సురక్షితంగా (ఆవలి ఒడ్డుకు) చేరవేశాము. అదే సమయంలో మీరు చూస్తుండగానే ఫిరౌనీయులను అందులో ముంచివేశాము
[51] (జ్ఞాపకం చేసుకోండి) మేము మూసా (అలైహిస్సలాం)కు నలభై రాత్రుల వాగ్దానం చేసి (అతన్ని పిలిచి) నప్పుడు, అతను వెళ్ళిన తరువాత మీరు ఆవు దూడను పూజించటం మొదలెట్టారు. ఆ విధంగా మీరు దుర్మార్గానికి పాల్పడ్డారు
[52] అయినప్పటికీ మేము మిమ్మల్ని మన్నించి వదలిపెట్టాము – అలాగయినా కృతజ్ఞులవుతారేమోనని
[53] ఇంకా మేము మూసాకు, మీ మార్గదర్శకత్వం నిమిత్తం గ్రంథాన్నీ, గీటురాయినీ ప్రసాదించాము
[54] (గుర్తు చేయి) మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు: “ఓ నా జాతివారలారా! ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకుని మీరు మీ స్వయానికి అన్యాయం చేసుకున్నారు. కనుక ఇప్పుడు మీరు పశ్చాత్తాప భావంతో మీ సృష్టికర్త వైపుకు మరలండి. (ఈ ఘోర కృత్యానికి పాల్పడిన) మీలోని వారిని చంపండి. మీ సృష్టికర్త వద్ద ఇదే మీ కొరకు మేలైనది.” మరి ఆయన మీ పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. నిస్సందేహంగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కనికరించేవాడు
[55] మీరు మూసాతో అన్న మాటలను గుర్తుకు తెచ్చుకోండి : “ఓ మూసా! మేము అల్లాహ్ను కళ్ళారా చూడనంతవరకూ నిన్ను విశ్వసించము.” (మీ ఈ పెడసరి ధోరణికి శిక్షగా) మీరు చూస్తుండగానే (మీపై) పిడుగు పడింది
[56] అయితే (ఈసారయినా) మీరు కృతజ్ఞులవుతారేమోనన్న ఉద్దేశంతో చనిపోయిన మిమ్మల్ని తిరిగి బ్రతికించాము
[57] మేము మీపై మేఘాల ఛాయను కల్పించాము. మీపై మన్న్, సల్వాలను (ఆహారంగా) దించాము. “మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన వస్తువులను తినండి” (అని చెప్పాము. కాని, వారు ఆ అనుగ్రహాలు అనుభవించి కృతజ్ఞులయ్యే బదులు కృతఘ్నత చూపటం మొదలుపెట్టారు). వారు మాకెలాంటి అన్యాయం చేయలేదు, కాకపోతే వారు తమకు తామే అన్యాయం చేసుకుంటూ పోయారు
[58] (ఇంకా ఆ విషయాన్ని కూడా నెమరు వేసుకోండి). “ఈ పురములో ప్రవేశించండి. అక్కడ మీకు ఇష్టమైన చోట, కోరుకున్న విధంగా తృప్తిగా తినండి. కాని నగర ముఖద్వారం గుండా పోతున్నప్పుడు ‘సజ్దా’ చేస్తూ మరీ పోవాలి. పోతున్నప్పుడు ‘హిత్తతున్’అని నోటితో పలుకుతూ ముందుకు సాగాలి. అప్పుడు మేము మీ తప్పులను మన్నిస్తాము, సదాచార సంపన్నులకు మరింతగా అనుగ్రహిస్తాము” అని మేము మీతో అన్నాము
[59] కాని దుర్మార్గులు వారితో అనబడిన ఈ మాటను మార్చి వేశారు. అందుచేత మేము కూడా ఆ దుర్మార్గులపై వారి (దుర్మార్గం), ధిక్కార వైఖరికి శాస్తిగా ఆకాశం నుంచి శిక్షను అవతరింపజేశాము
[60] మూసా (అలైహిస్సలాం) తన జాతి ప్రజల కోసం నీటిని అడిగినప్పుడు, “నీ చేతి కర్రతో ఆ (కొండ) రాతిపై కొట్టు” అని మేమన్నాము. (అలా కొట్టగా) దాన్నుండి పన్నెండు ఊటలు పెల్లుబికాయి. వారిలోని ప్రతి తెగవారూ తమ తమ నీటి స్థలాన్ని తెలుసుకున్నారు. (అప్పుడు మేము వారికి ఈ విధంగా ఆదేశించాము:) “అల్లాహ్ (మీకు ప్రసాదించిన) ఉపాధిని తినండి, త్రాగండి. భువిలో అలజడిని రేపుతూ తిరగకండి.”
[61] (జ్ఞాపకం చేసుకోండి,) “ఓ మూసా! ఒకే రకమైన తిండిని మేము అస్సలు సహించము. అందుకే భూమిలో పండే ఆకుకూరలు, దోసకాయలు, గోధుమలు, పప్పుదినుసులు, ఉల్లిపాయలు ప్రసాదించవలసినదిగా నీ ప్రభువును ప్రార్థించు” అని మీరు డిమాండు చేసినప్పుడు అతనిలా అన్నాడు: “మీరు శ్రేష్ఠమైన వస్తువుకు బదులుగా అధమమైన దానిని కోరుకుంటున్నారెందుకు? (సరే!) ఏదయినా పట్టణానికి వెళ్ళండి. అక్కడ మీరు కోరుకున్నవన్నీ మీకు లభిస్తాయి.” దాంతో వారిపై పరాభవం, దారిద్య్రం రుద్దబడింది. వారు దైవాగ్రహానికి గురై తరలిపోయారు. వారి ఈ దురవస్థకు కారణమేమిటంటే వారు అల్లాహ్ ఆయతుల పట్ల తిరస్కార వైఖరిని అవలంబించేవారు, అన్యాయంగా ప్రవక్తలను చంపేవారు. ఇది వారి అవిధేయతకు, బరితెగించిన పోకడకు పర్యవసానం మాత్రమే
[62] విశ్వసించిన వారైనా, యూదులైనా, నసారాలయినా, సాబియనులయినా – ఎవరయినాసరే – అల్లాహ్ను, అంతిమ దినాన్ని విశ్వసించి సదాచరణ చేస్తే వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉం(టుం)ది. వారికెలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు
[63] తూరు పర్వతాన్ని మీ పైకి ఎత్తి మేము మీ చేత చేయించిన ప్రమాణాన్ని కాస్త జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు, “మేము మీకు ప్రసాదించిన దానిని (గ్రంథాన్ని) గట్టిగా పట్టుకోండి. అందులో వున్న వాటిని బాగా జ్ఞాపకం చేసుకోండి, దీని ద్వారానే మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంది” (అని ఉపదేశించాము)
[64] కాని దీని తరువాత మీరు విముఖులైపోయారు. అయినప్పటికీ దైవానుగ్రహం, దైవకారుణ్యం మీపై ఉండింది. లేకపోతే మీరు (తీవ్రంగా) నష్టపోయేవారే
[65] శనివారం విషయంలో ఆజ్ఞోల్లంఘనకు పాల్పడిన మీ వారి గురించి కూడా మీకు బాగా తెలుసు. “అత్యంత అసహ్యకరమైన, ఛీత్కరించబడిన కోతులుగా మారిపోండి” అని మేము వాళ్ళను శపించాము
[66] దీనిని మేము ఆ కాలం వారికీ, భావితరాల వారికీ గుణపాఠ సూచనగానూ, భయభక్తులు కలవారికి హితబోధగానూ చేశాము
[67] మూసా తన జాతివారితో, “అల్లాహ్ మిమ్మల్ని ఒక ఆవును ‘జిబహ్’ చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాడు” అని అన్నప్పుడు, “ఏమిటీ, మాతో వేళాకోళం చేస్తున్నావా?” అని వారు ప్రశ్నించారు. దానికి అతను, “నేనలాంటి మూర్ఖుల్లో ఒకణ్ణి కాకుండా ఉండేందుకు అల్లాహ్ శరణు వేడుతున్నాను” అని జవాబిచ్చాడు
[68] అప్పుడు వారు, “అయితే అది ఎటువంటిది అయిఉండాలో మాకు వివరించవలసిందిగా నీ ప్రభువును అర్థించు” అని అన్నారు. దానికి అతను, “అది మరీ ముసలిదై ఉండకూడదు, మరీ లేగదూడగా కూడా ఉండరాదు. పైగా అది మధ్యవయస్సులో వున్న ఆవు అయి ఉండాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. (సరేనా!) ఇక ఆజ్ఞాపించబడిన విధంగా చెయ్యండి” అని చెప్పాడు
[69] “అది ఏ రంగుదై ఉండాలో మాకు వివరించమని నీ ప్రభువును ప్రార్థించు” అని మళ్ళీ అడిగారు. “అది పసుపు వర్ణంగలదై, నిగనిగలాడుతూ, చూసేవారికి ఆకర్షణీయంగా కనిపించేలా ఉండాలన్నది అల్లాహ్ ఆజ్ఞ” అని మూసా సమాధానమిచ్చాడు
[70] అప్పుడు వారు, “అది ఎలాంటిదై ఉండాలో మాకు (ఇంకా బాగా) వివరించమని నీ ప్రభువును ప్రార్థించు. మాకు ఆవు సంగతి ఇంకా ప్రస్ఫుటం కాలేదు. అల్లాహ్ గనక తలిస్తే మేము మార్గదర్శకత్వం పొందుతాము” అని అన్నారు
[71] దానికి అతను, “ఆ ఆవు పనిచేసేదీ, దుక్కి దున్నేదీ, సేద్యపు పనిలో ఉపయోగపడేదీ అయి ఉండకూడదు. ఇంకా అది ఆరోగ్యవంతమైనదై, ఎటువంటి మచ్చలూ లేకుండా ఉండాలి అన్నది అల్లాహ్ ఆజ్ఞ” అని చెప్పాడు. దానికి వారు “నువ్వు ఇప్పుడు సరిగ్గా చెప్పావు. (మాకిప్పుడు అర్థం అయింది)” అన్నారు. అసలు వారు ఆదేశపాలనకు ఏమాత్రం సుముఖంగా లేరు. ఎట్టకేలకు (మాట విని) ఆవును జిబహ్ చేశారు
[72] (జ్ఞాపకం చేసుకోండి.) మీరు ఒక వ్యక్తిని హత్య చేసి, ఆ విషయంలో పరస్పరం విభేదించుకోసాగారు. కాని మీ గుట్టును అల్లాహ్ రట్టు చేయాలనే నిర్ణయించుకున్నాడు
[73] కనుక, “ఈ ఆవు (మాంసపు) ముక్క నొకదాన్ని హతుని దేహానికేసి కొట్టండి (అతడు లేచి నిలబడతాడు)” అని మేము అన్నాము. ఈ విధంగా అల్లాహ్ మృతులను బ్రతికించి తన నిదర్శనాలను చూపుతున్నాడు – మీరు ఇకనయినా బుద్ధిగా మసలుకోవాలని
[74] కాని ఆ తరువాత మీ హృదయాలు కఠినమైపోయాయి. రాళ్ళ మాదిరిగా, కాదు – వాటికంటే కూడా కఠినం అయిపోయాయి. కొన్ని రాళ్ళల్లోనుంచైతే సెలయేళ్ళు ప్రవహిస్తాయి. మరి కొన్ని రాళ్ళు పగలగా వాటి నుంచి నీరు చిమ్ముతుంది. మరికొన్ని అల్లాహ్ భయంతో (కంపించి) క్రిందపడి పోతాయి. మీ కార్యకలాపాల పట్ల అల్లాహ్ పరధ్యానంలో ఉన్నాడని అనుకోకండి
[75] (ముస్లిములారా!) వారు మీ మాటను నమ్ముతారనే (ఇప్పటికీ) మీరు ఆశపడ్తున్నారా? వాస్తవానికి వారిలో, అల్లాహ్ వాక్కును విని, అర్థం చేసుకుని కూడా ఉద్దేశపూర్వకంగా దాన్ని మార్చి వేసేవారు ఉన్నారు
[76] వారు విశ్వాసులను కలుసుకున్నప్పుడు తమ విశ్వాసాన్ని వెల్లడిస్తారు. తమ వర్గానికి చెందినవారిని ఏకాంతంలో కలుసుకున్నప్పుడు, “అల్లాహ్ మీకు తెలియజేసిన విషయాలను మీరు వీరికి ఎందుకు చేరవేస్తున్నారు? తద్వారా మీ ప్రభువు సమక్షంలో వారు మీపై వాదనకు బలం పొందగలరనే సంగతిని విస్మరించారా ఏమి?” అని అంటారు
[77] వారు దాచేదీ, బహిర్గతం చేసేదీ – అంతా అల్లాహ్కు తెలుసన్న సంగతి వారికి తెలియదా
[78] వారిలో చదువురాని వారు కొందరున్నారు – వారికి గ్రంథ జ్ఞానం లేదు. వారు కేవలం ఆశల్ని నమ్ముకొని ఉన్నారు. లేనిపోని అంచనాలు వేసి, ఊహల్లో విహరిస్తూ ఉంటారు
[79] తమ స్వహస్తాలతో లిఖించిన గ్రంథాన్ని దైవగ్రంథమని చెప్పి, ప్రాపంచిక తుచ్ఛ ప్రయోజనాన్ని పొందజూసే వారికి ‘వినాశం’ కలదు. వారి ఈ స్వహస్త లిఖిత రచన కూడా వారి వినాశానికి దారితీస్తుంది. వారి ఈ సంపాదన కూడా వారి నాశనానికి కారణ భూతం అవుతుంది
[80] పైగా, “మేము నరకాగ్నిలో కొన్ని రోజులు మాత్రమే ఉంటాము” అని వారంటున్నారు. వారిని అడుగు: మీరు ఆ మేరకు అల్లాహ్ నుండి పొందిన వాగ్దానం ఏదన్నా మీ వద్ద ఉందా? ఒకవేళ ఉంటే అల్లాహ్ ముమ్మాటికీ తన వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించడు. (అసలు అలా జరగనే లేదు) అసలు మీరు మీకు తెలియని విషయాలను అల్లాహ్కు ఆపాదిస్తున్నారు
[81] నిస్సందేహంగా – ఎవడు పాపకార్యాలకు ఒడిగట్టాడో, అతని పాపాలు అతన్ని చుట్టుముట్టాయో అలాంటివారే నరకవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు
[82] మరెవరు విశ్వసించి, మంచి పనులు చేస్తారో వారు స్వర్గవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు
[83] మేము ఇస్రాయీల్ వంశస్థుల నుండి వాగ్దానం తీసుకున్నాము (దాన్ని గుర్తుకు తెచ్చుకోండి) : “అల్లాహ్ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా మెలగాలి. అలాగే బంధువులను, అనాధలను, అగత్యపరులను (ఆదరించాలి). ప్రజలతో మర్యాదగా మాట్లాడాలి. నమాజును నెలకొల్పుతూ ఉండాలి, జకాత్ ఇస్తూ ఉండాలి.” అయితే మీలో కొద్దిమంది తప్ప అందరూ మాట తప్పారు, ముఖం తిప్పుకున్నారు
[84] పరస్పరం రక్తం చిందించరాదనీ (చంపుకోరాదని), తోటి వారిని వారి నివాసస్థలాల నుంచి బహిష్కరించరాదనీ మీనుండి వాగ్దానం తీసుకున్నప్పుడు, దానికి మీరు అంగీకరించారు. ఆ విషయానికి స్వయంగా మీరే సాక్షులు
[85] కాని మీరు పరస్పరం చంపుకున్నారు. మీలోని ఒక వర్గం వారిని ఇండ్ల నుంచి బహిష్కరించటం కూడా చేశారు. పాపానికి, దౌర్జన్యానికి పాల్పడుతూ మీరు వారికి వ్యతిరేకంగా-ఇతరులను సమర్థించారు. మరి వారు బందీలుగా పట్టుబడి మీ వద్దకు వచ్చినప్పుడు మీరు వారికోసం నష్టపరిహారం ఇచ్చిన మాట వాస్తవమే. కాని మీరు వారిని వెళ్ళగొట్టడమే అధర్మం (అప్పుడు మీరు దాన్ని అస్సలు లెక్కచేయలేదు). ఏమిటీ? మీరు కొన్ని ఆజ్ఞలను విశ్వసించి, మరికొన్నింటిని తిరస్కరిస్తున్నారా? మీలో ఇలా చేసేవారికి ప్రపంచ జీవితంలో అవమానం తప్ప ఇంకేం ప్రతిఫలం ఉంటుంది? ఇక ప్రళయ దినాన వారు మరింత కఠినమైన శిక్ష వైపు మరలించబడతారు. అల్లాహ్కు మీ చేష్టలు తెలియకుండా లేవు
[86] పరలోకానికి బదులుగా ప్రాపంచిక జీవితాన్ని కొనుక్కున్న వారు వీరే. వీరికి విధించబడే శిక్షల్లో తగ్గింపూ ఉండదు, వారికి సహాయపడటమూ జరగదు
[87] మేము మూసాకు గ్రంథం వొసగాము. అతని తరువాత కూడా ప్రవక్తలను పంపించాము. ఇంకా మేము మర్యమ్ కుమారుడైన ఈసాకు స్పష్టమైన నిదర్శనాలు ఇచ్చాము. రూహుల్ ఖుదుస్ ద్వారా అతనికి సహాయం చేశాము. అయితే ఏ ప్రవక్త అయినా మీ మనసులకు నచ్చని విషయాలు మీ వద్దకు తెచ్చినప్పుడల్లా మీరు అహంకారం ప్రదర్శించారు. వారిలో కొందరిని ధిక్కరించారు, మరి కొందరిని హతమార్చటం కూడా చేశారు
[88] “మా హృదయాలు గలేబుల్లో చుట్టబడి ఉన్నాయ”ని వారంటున్నారు. కాదు, వారి తిరస్కారవైఖరి మూలంగా అల్లాహ్ వారిని ధూత్కరించాడు. కనుక వారు విశ్వసించేది బహుస్వల్పం
[89] వారి వద్ద (ముందు నుంచే) ఉన్న దైవగ్రంథాన్ని ధృవీకరించే గ్రంథం అల్లాహ్ వద్ద నుంచి వచ్చినప్పుడు, తెలిసి కూడా వారు దానిని తిరస్కరించసాగారు – మరి చూడబోతే దీని రాకకు మునుపు తమకు అవిశ్వాసులపై విజయం చేకూరాలని వారు స్వయంగా అభిలషించేవారు. ఇటువంటి తిరస్కారులపై అల్లాహ్ శాపం పడుగాక
[90] ఏ వస్తువుకు బదులుగా వారు తమను అమ్ముకున్నారో అది అత్యంత నీచమైనది- అది వారి తిరస్కారం. అల్లాహ్ తాను ఇష్టపడే తన దాసుణ్ణి ప్రత్యేకంగా అనుగ్రహించాడన్న అసూయతో వారు అల్లాహ్ తరఫున అవతరించిన విషయాలను తిరస్కరించి ఆగ్రహంపై ఆగ్రహానికి పాత్రులయ్యారు. ఇంకా ఈ తిరస్కారుల కొరకు ఘోర అవమానంతో కూడిన శిక్ష ఉంది
[91] “అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్ని విశ్వసించండి” అని వారితో అన్నప్పుడు, “మాపై అవతరింపజేయబడిన దానిని మేము విశ్వసిస్తున్నాం” అని సమాధానమిస్తారు. దాని తర్వాత వచ్చిన దాన్ని, అది సత్యమైనప్పటికీ, తమవద్ద ఉన్న గ్రంథాన్ని అది ధృవీకరిస్తున్నప్పటికీ వారు తిరస్కరిస్తారు. (సరే! అలాగైతే) వారిని ఈ విధంగా అడుగు: “(మునుపటి గ్రంథాలపై) మీకు నమ్మకముంటే, మరి పూర్వం వచ్చిన దైవప్రవక్తలను ఎందుకు హత్య చేశారు?”
[92] మీ వద్దకు మూసా ఈ సూచనలనే తీసుకువచ్చాడు. అయినా సరే అతను వెళ్ళిన తరువాత మీరు ఆవుదూడను పూజించారు. (అసలు విషయం ఏమిటంటే) మీరు దుర్మార్గులు
[93] మేము తూరు పర్వతాన్ని మీపైకి ఎత్తి, మీనుండి వాగ్దానం తీసుకున్న సందర్భాన్ని మననం చేసుకోండి – (ఆ సందర్భంగా మేము), “మీకు ప్రసాదించిన దానిని గట్టిగా పట్టుకోండి. మరియు వినండి” అని అనగానే, వారు “మేము విన్నాము. కాని శిరసావహించము” అని బదులిచ్చారు. అసలు వారి హృదయాలలో ఆవుదూడ పట్ల ప్రేమాభిమానాలు నూరి పోయబడ్డాయి. వారి అవిశ్వాసం కారణంగా (వారికీ దుర్గతి పట్టింది). వారితో అనండి : “మీరు విశ్వాసులే అయితే మీ ఈ విశ్వాసం మీకు చెడు ఆజ్ఞ ఇస్తోంది.”
[94] (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఒకవేళ అల్లాహ్ వద్ద పరలోక నివాసం ఇతర మానవులెవరికీ కాకుండా కేవలం మీ కొరకే ప్రత్యేకమై ఉంటే, రండి! మీ వాదన సత్యమైందనడానికి రుజువుగా మరణాన్ని కోరండి.”
[95] కాని వారు తమ చేజేతులా చేసుకున్న దురాగతాల దృష్ట్యా ఎన్నటికీ మరణాన్ని కోరరు. అల్లాహ్ దుర్మార్గుల గురించి బాగా ఎరిగినవాడు
[96] (ఓ ప్రవక్తా!) జీవితం పట్ల అందరికన్నా ఎక్కువ వ్యామోహం వీరికే ఉందన్న విషయాన్ని నువ్వు గ్రహిస్తావు. (జీవితం పట్ల వ్యామోహంలో) వీరు ముష్రిక్కులను కూడా మించిపోయారు. వీరిలోని ప్రతి ఒక్కడూ వెయ్యి సంవత్సరాల వయస్సును కోరుకుంటాడు. అయితే ఈ దీర్ఘాయుషు కూడా వారిని శిక్ష బారి నుంచి ఏ మాత్రం తప్పించలేదు. అల్లాహ్ వారి కార్యకలాపాలన్నింటినీ చూస్తూనే ఉన్నాడు
[97] (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “జిబ్రీల్కు శత్రువు అయిన ప్రతివాడూ (అల్లాహ్తో శత్రుత్వాన్ని కొనితెచ్చుకున్నాడన్న) యదార్థాన్ని గ్రహించాలి. ఎందుకంటే అల్లాహ్ సూచనపైనే ఆయన నీ హృదయంపై ఈ సందేశాన్ని అవతరింపజేశాడు. ఇది (ఈ ఖుర్ఆన్) తనకు పూర్వం వచ్చిన గ్రంథాలను ధృవీకరిస్తుంది. విశ్వసించేవారికి మార్గదర్శకత్వం వహిస్తూ, వారికి శుభవార్త ఇస్తుంది
[98] ఎవరు అల్లాహ్కు, ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రీల్ మరియు మీకాయీల్కు శత్రువులుగా ఉంటారో, అటువంటి అవిశ్వాసులకు అల్లాహ్ శత్రువుగా ఉంటాడు
[99] (ఓ ప్రవక్తా!) స్పష్టమైన సూచనలను మేము నీపై అవతరింపజేశాము. అవిధేయులు తప్ప వేరెవరూ వాటిని త్రోసిపుచ్చరు
[100] వారెప్పుడు ఏ వాగ్దానం చేసినా, వారిలోని ఏదో ఒక వర్గం దాన్ని భంగపరుస్తుంది. పైగా వారిలో అనేకులు విశ్వాసులు కారు
[101] వారి వద్దకు, వారి గ్రంథాన్ని నిజమని ధృవీకరించే ప్రవక్త అల్లాహ్ తరఫు నుంచి ఎప్పుడు వచ్చినా ఆ గ్రంథ వహులలోని ఒక వర్గంవారు, దైవగ్రంథాన్ని, అసలు దాని గురించి ఏమీ తెలియనివారుగా వెనుక పడవేశారు
[102] వారు సులైమాను రాజ్యంలోని షైతానులు అవలంబించిన విషయాల వెనుకపడ్డారు. అసలు సులైమాను ఎన్నడూ అవిశ్వాసానికి ఒడిగట్టలేదు, ఈ అవిశ్వాస పోకడ అసలు షైతానులదే. వారు ప్రజలకు చేతబడిని నేర్పేవారు. వారు బాబిలోనియాలో హారూత్, మారూత్ అనే ఇద్దరు దైవదూతలపై అవతరింపజేయబడిన విద్య వెంటపడ్డారు. “మేము ఒక పరీక్ష వంటివారం. నువ్వు మాత్రం అవిశ్వాసానికి పాల్పడకు” అని (స్పష్టంగా) చెప్పనంతవరకూ వారు (ఇద్దరూ) ఎవరికీ ఆ విద్యను నేర్పేవారు కూడా కాదు. అయినప్పటికీ జనులు వారి దగ్గర భార్యాభర్తలను విడగొట్టే విద్యను నేర్చుకునేవారు. ఎంత చేసినా వారు అల్లాహ్ అనుమతి లేకుండా ఆ చేతబడి ద్వారా ఎవరికీ ఎలాంటి కీడు కలిగించలేరు సుమా! తమకు నష్టం తప్ప ఏమాత్రం ప్రయోజనం చేకూర్చని దానిని వారు నేర్చుకుంటున్నారు. ఆ విద్యను కొనుక్కున్నవారికి పరలోకంలో (అక్కడి సుఖసౌఖ్యాలలో) ఎలాంటి భాగం లేదన్న సంగతి వారికి సయితం తెలుసు. ఎంత నీచమైన వస్తువుకు బదులుగా వారు తమను తాము అమ్ముకుంటున్నారో వారికి తెలిస్తే ఎంత బావుండు
[103] వారే గనక విశ్వసించి, అల్లాహ్ పట్ల భీతిపరులుగా వ్యవహరించి ఉంటే అల్లాహ్ తరఫున వారికి అత్యుత్తమ పుణ్యఫలం లభించి ఉండేది. ఆ సంగతిని వారు తెలుసుకోగలిగితే ఎంత బావుండేది
[104] ఓ విశ్వాసులారా! (దైవప్రవక్త-సల్లల్లాహు అలైహి వ సల్లంను) ‘రాయినా’ అని అనకండి, ‘ఉన్జుర్నా’ అని అనండి. శ్రద్ధగా వింటూ ఉండండి. అవిశ్వాసుల కొరకు బాధాకరమైన శిక్ష ఉంది
[105] మీపై మీ ప్రభువు తరఫు నుంచి ఏదైనా మేలుతో కూడుకున్న విషయం అవతరించటం గ్రంథవహుల్లోని తిరస్కారులకుగానీ, ముష్రిక్కు (బహుదైవారాధకు)లకు గానీ ఏమాత్రం ఇష్టం లేదు. (వారెంతగా అసూయ చెందినా ఫరవాలేదు) అల్లాహ్ తన ప్రత్యేక కారుణ్యం నుంచి తాను కోరిన వారికి అనుగ్రహిస్తాడు, అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు
[106] (ఓ ప్రవక్తా!) ఏదేని ఒక వాక్యాన్ని మేము రద్దుపరచినా లేక మరపింపజేసినా (దాని స్థానంలో) దానికన్నా ఉత్తమమైన దానినీ లేదా కనీసం దానికి సమానమైన దానిని తీసుకువస్తాము. అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడన్న సంగతి నీకు తెలియదా
[107] భూమ్యాకాశాల సార్వభౌమత్వం అల్లాహ్దేననీ, అల్లాహ్ తప్ప మరొకరెవరూ మీ రక్షకులూ, సహాయకులూ కారన్న విషయం నీకు తెలియదా
[108] లోగడ మూసా (అలైహిస్సలాం)కు వేయబడినటువంటి ప్రశ్నలే మీరు మీ ప్రవక్త (ముహమ్మద్-స)కు వేయదలుస్తున్నారా? (అయితే వినండి) విశ్వాసాన్ని అవిశ్వాస వైఖరి ద్వారా మార్చేవాడు రుజుమార్గం నుంచి తప్పిపోతాడు
[109] ఈ గ్రంథవహుల్లోని అనేకులు, సత్యమేదో స్పష్టంగా తెలిసి పోయినప్పటికీ – కేవలం తమ మనసులలో ఉన్న అసూయ మూలంగా మిమ్మల్ని కూడా విశ్వాస మార్గం నుంచి అవిశ్వాసం వైపు మళ్ళించాలని చూస్తున్నారు. కాబట్టి అల్లాహ్ తన ఆదేశాన్ని తీసుకువచ్చే వరకూ మీరు కూడా మన్నింపుల వైఖరిని అవలంబిస్తూ ఉండండి, వారిని పట్టించుకోకండి. నిశ్చయంగా అల్లాహ్ అన్నింటిపై అధికారం కలవాడు
[110] మీరు మాత్రం నమాజును నెలకొల్పుతూ, జకాత్ను ఇస్తూ ఉండండి, మీరు మీ కోసం ఏ మంచి పనులను ముందుగా పంపుకున్నా అల్లాహ్ వద్ద వాటిని పొందుతారు. నిస్సందేహంగా అల్లాహ్ మీ కార్యకలాపాలన్నింటినీ గమనిస్తూనే ఉన్నాడు
[111] “యూదులు, క్రైస్తవులు తప్ప వేరెవరూ స్వర్గంలో ప్రవేశించలేర”ని వారంటున్నారు. ఇవి వారి ఆశలు, ఆకాంక్షలు మాత్రమే. “మీరు మీ వాదనలో సత్యవంతులే అయితే ఆ మేరకు ఏదన్నా నిదర్శనం సమర్పించండి” అని వారిని అడుగు
[112] ఔను మరి! ఎవడైతే ఆచరణలో అత్యుత్తమ రీతిని అవలంబించి తనను తాను అల్లాహ్ సన్నిధిలో సమర్పించుకుంటాడో, అతనికి తన ప్రభువు వద్ద ప్రతిఫలం ఉంది. అలాంటి వారికి ఎలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండవు
[113] క్రైస్తవులు సత్యంపై లేరని యూదులు అంటున్నారు. యూదులు సత్యంపై లేరని క్రైస్తవులంటున్నారు. మరి చూడబోతే వారంతా గ్రంథాన్ని చదువుతున్నారు. జ్ఞానం లేనివాళ్ళు కూడా ఇలాంటి మాటే అంటున్నారు. కనుక అల్లాహ్ ప్రళయ దినాన వీళ్ళ భేదాభిప్రాయం గురించి వీళ్ళ మధ్య తీర్పు చేస్తాడు
[114] అల్లాహ్ మస్జిదులలో, ఆయన నామస్మరణను అడ్డుకుని, వాటిని పాడుచేయడానికి ప్రయత్నించేవానికంటే పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? అటువంటివారు వాటిలో ప్రవేశించినా భయపడుతూనే ప్రవేశించాలి సుమా! వారికి ప్రపంచంలోనూ పరాభవం తప్పదు, పరలోకంలో కూడా మహా ఘోర శిక్ష తప్పదు
[115] తూర్పుపడమరలకు అధిపతి అల్లాహ్యే. మీరు మీ ముఖాన్ని ఏ వైపుకు త్రిప్పినా, అటు అల్లాహ్ సమ్ముఖం లభిస్తుంది. నిస్సందేహంగా అల్లాహ్ విస్తృతి కలవాడు, సర్వమూ తెలిసినవాడు
[116] అల్లాహ్కు సంతానం కలదని వీళ్ళు అంటున్నారు. (ఇలాంటి మాటలకు) ఆయన అతీతుడు, పవిత్రుడు. పైగా భూమ్యాకాశాలలో వున్న సమస్తమూ ఆయనదే. అవన్నీ ఆయన (ఆజ్ఞల)కు తల ఒగ్గి ఉన్నాయి
[117] భూమ్యాకాశాలను ప్రప్రథమంగా సృష్టించినవాడు ఆయనే. ఆయన ఏ పనినైనా చేయ సంకల్పించుకున్నప్పుడు దాన్ని ‘అయిపో’ అని అంటే చాలు, అది అయిపోతుంది
[118] జ్ఞానం లేనివాళ్లు, “అల్లాహ్ స్వయంగా మాతో ఎందుకు మాట్లాడడు? లేక మా వద్దకు ఏదైనా సూచన ఎందుకురాదు?” అని అంటారు. వారి పూర్వీకులు కూడా ఇలాంటి పలుకులే పలికారు. వారందరి హృదయాలు ఒకే విధమైనవి. వాస్తవానికి నమ్మేవారి కోసం మేము మా సూచనలను స్పష్టం చేసే ఉంచాము
[119] (ఓ ప్రవక్తా!) మేము నిన్ను సత్యంతో పాటు శుభవార్తనిచ్చే వానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. నరకవాసుల గురించి నిన్ను (నిలదీసి) అడగటం జరగదు
[120] (ఓ ముహమ్మద్!) నువ్వు వారి విధానాన్ని అనుసరించనంత వరకూ యూదులు, క్రైస్తవులు నిన్ను ఇష్టపడరు. అల్లాహ్ చూపిన మార్గమే సరైన మార్గం అని నువ్వు వారికి చెప్పేయి. ఒకవేళ నువ్వు నీ వద్దకు జ్ఞానం వచ్చిన మీదట కూడా వారి కోరికలను అనుసరిస్తే, అల్లాహ్ (పట్టు) నుండి నిన్ను రక్షించేవాడు, సహాయకుడూ ఎవడూ ఉండడు
[121] మేము ఎవరికి గ్రంథం వొసగామో వారు దానిని పారాయణం చేయవలసిన రీతిలో పారాయణం చేస్తారు. (అంతేకాదు,) వారు ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారు. ఇక, దీనిపట్ల తిరస్కార వైఖరిని అవలంబించినవారే నష్టపోయేది
[122] ఓ (యాఖూబు) ఇస్రాయీలు సంతతివారలారా! నేను మీపై కురిపించిన వరాలను జ్ఞప్తికి తెచ్చుకోండి. నేను మీకు సమస్త లోకాలపై (అలనాటి అన్ని జాతులపై, సమాజాలపై) శ్రేష్ఠతను వొసగాను
[123] ఎవరూ ఎవరికీ ఏ విధంగానూ తోడ్పడలేని, ఎవరి నుంచీ పరిహారం కూడా స్వీకరించబడని, ఏ సిఫారసూ ఎవరికీ ప్రయోజనకరం కాజాలని, ఎవరికీ సహాయం కూడా చేయజాలని ఆ దినానికి భయపడండి
[124] (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీం (అలైహిస్సలాం)ను అతని ప్రభువు అనేక విషయాలలో పరీక్షించగా, అతను అన్నింటిలోనూ (నికార్సుగా) నెగ్గుకు వచ్చాడు. అప్పుడు అల్లాహ్ అతన్ని ఉద్దేశించి, “నేను నిన్ను ప్రజలకు నాయకునిగా చేస్తాను” అన్నాడు. దానికి అతను, “నా సంతానాన్ని కూడానా!” అని అడిగాడు. అప్పుడు అల్లాహ్, “దుర్మార్గులకు నా వాగ్దానం వర్తించదు” అని సమాధానం ఇచ్చాడు
[125] (జ్ఞాపకం చేసుకోండి) మేము ఈ గృహాన్ని (కాబా గృహాన్ని) మానవులందరి పుణ్యక్షేత్రంగానూ, శాంతి నిలయంగానూ చేశాము. మీరు ఇబ్రాహీము నిలబడిన ప్రదేశాన్ని నమాజు స్థలంగా చేసుకోండి. “నా గృహాన్ని (సందర్శించి) ప్రదక్షిణ చేసేవారి కోసం, అక్కడ ఏతెకాఫ్ పాటించేవారి కోసం, రుకూ సజ్దాలు చేసేవారి కోసం మీరు దానిని పరిశుభ్రంగా, పరిశుద్ధంగా ఉంచాలి అని ఇబ్రాహీము, ఇస్మాయీలు నుంచి మేము వాగ్దానం తీసుకున్నాము
[126] “నా ప్రభూ! నీవు ఈ ప్రదేశాన్ని శాంతి నగరంగా చెయ్యి. ఈ నగరవాసులలో అల్లాహ్ను, అంతిమ దినాన్నీ విశ్వసించే వారికి పండ్లు ఫలాలను ఆహారంగా ప్రసాదించు” అని ఇబ్రాహీం అర్థించినప్పుడు అల్లాహ్ ఈ విధంగా పలికాడు: “విశ్వసించనివారికి కూడా నేను కొంత ప్రయోజనం చేకూర్చుతాను. కాని చివరకు వారిని అగ్నిశిక్ష వైపుకు ఈడుస్తాను. అది అత్యంత చెడ్డ నివాస స్థలం.”
[127] ఇబ్రాహీం (అలైహిస్సలాం), ఇస్మాయీల్ (అలైహిస్సలాం)- ఇద్దరూ (కాబా) గృహ పునాదులను, గోడలను లేపుతూ ఇలా ప్రార్థించేవారు: “మా ప్రభూ! మా సేవను స్వీకరించు. నీవు మాత్రమే సర్వం వినేవాడవు, సర్వం తెలిసినవాడవు.”
[128] “మా ప్రభూ! మమ్మల్ని నీ విధేయులు (ముస్లింలు)గా చేసుకో. మా సంతతి నుండి కూడా నీ విధేయతకు కట్టుబడి ఉండే ఒక సమూహాన్ని ప్రభవింపజెయ్యి. మాకు మా ఆరాధనా రీతులను నేర్పు. మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా నీవు మాత్రమే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడవు, అపారంగా కరుణించేవాడవు.”
[129] “మా ప్రభూ! నీ వాక్యాలను వారికి చదివి వినిపించే, గ్రంథజ్ఞానాన్ని నేర్పించే, విజ్ఞతా వివేచనలను విడమరచి చెప్పే, వారిని పరిశుద్ధపరచే ఒక ప్రవక్తను స్వయంగా వారి జాతి నుండే వారిలో ప్రభవింపజెయ్యి. నిస్సందేహంగా నీవు సర్వాధికుడవు, వివేకవంతుడవు.”
[130] శుద్ధ అవివేకి మాత్రమే ఇబ్రాహీం ధర్మం (విధానం) పట్ల విరక్తి చెందుతాడు. మేము అతన్ని ప్రపంచంలోనూ ఎన్నుకున్నాము, పరలోకంలో కూడా అతడు సజ్జనుల సరసన ఉంటాడు
[131] “(ఆత్మ) సమర్పణ చేసుకో” అని అతని ప్రభువు అతన్ని ఆదేశించినప్పుడల్లా , “సకల లోకాల ప్రభువు సమక్షంలో నన్ను నేను సమర్పించుకున్నాను” అని అతను సమాధానం ఇచ్చాడు
[132] ఈ ఉపదేశమే ఇబ్రాహీం మరియు యాఖూబ్ తమ సంతానానికి చేశారు. (వారిలా అన్నారు:) “నా బిడ్డలారా! అల్లాహ్ మీ కోసం ఈ (విధేయతా) ధర్మాన్నే ఇష్టపడ్డాడు. కనుక మీరు ముస్లింలుగా తప్ప మరణించకూడదు సుమా!”
[133] ఏమిటీ, యాఖూబ్ మరణ ఘడియల్లో ఉన్నప్పుడు మీరక్కడ ఉన్నారా? ఆ సమయంలో ఆయన తన సంతానాన్నుద్దేశించి, “నా తదనంతరం మీరు దేనిని ఆరాధిస్తారు?” అని అడిగాడు. దానికి వారంతా, “మీ ఆరాధ్య దైవాన్ని, మీ పితామహులగు ఇబ్రాహీం, ఇస్మాయీలు, ఇస్హాఖ్ల ఆరాధ్యదైవం అయిన ఏకైక ఆరాధ్యుణ్ణి మాత్రమే ఆరాధిస్తాము, ఆయనకే విధేయులమై ఉంటాము” అని జవాబు ఇచ్చారు
[134] అది గతించిన ఒక సమూహం. వారు చేసుకున్నది వారికి చెందుతుంది. మీరు చేసేది మీకు చెందుతుంది. వారి కర్మల గురించి మీరు ప్రశ్నించబడరు
[135] మీరు యూదులుగానో, క్రైస్తవులుగానో మారిపోతే సన్మార్గం పొందగలరని వారు అంటారు. (ఓ ముహమ్మద్!) మీరు వారికి స్పష్టంగా చెప్పండి: “కాదు, ఇబ్రాహీము ధర్మాన్ని అనుసరించే వారే సన్మార్గంపై ఉన్నారు. ఇబ్రాహీం స్వచ్ఛమైన ఏకదైవారాధ కుడు, అతను బహుదైవోపాసకుడు కాదు.”
[136] (ముస్లిములారా!) మీరు ఇలా ప్రకటించండి : ”మేము అల్లాహ్ను విశ్వసించాము. మాపై అవతరింపజేయబడిన దానినీ, ఇబ్రాహీం, ఇస్మాయీల్, ఇస్హాఖ్, యాఖూబ్ మరియు వారి సంతతిపై అవతరింపజేయబడిన దానినీ, మూసా, ఈసా ప్రవక్తలకు వారి ప్రభువు తరఫున వొసగబడిన దానిని కూడా మేము విశ్వసించాము. మేము వారిలో ఎవరి మధ్య కూడా ఎలాంటి విచక్షణ (వివక్ష)ను పాటించము. మేము ఆయనకే విధేయులము.”
[137] ఒకవేళ వారు మీరు విశ్వసించినట్లే విశ్వసిస్తే, సన్మార్గం పొందగలరు. విముఖత గనక చూపితే వారు వైరభావానికి లోనై ఉన్నారన్నది సుస్పష్టం. వారి బారి నుండి (రక్షించటానికి) నీకు అల్లాహ్ చాలు. ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు
[138] అల్లాహ్ రంగును స్వీకరించండి. అల్లాహ్ రంగుకన్నా మంచి రంగు ఎవరిది కాగలదు? మేము మాత్రం ఆయన్నే ఆరాధిస్తాము
[139] వారితో చెప్పు : “ఏమిటీ, మాకూ ప్రభువు, మీకూ ప్రభువు అయిన అల్లాహ్ విషయంలో మీరు మాతో వాదులాడుతారా? మా ఆచరణలు మాకు, మీ ఆచరణలు మీకు. మేము ఆయనకే అంకితం అయ్యాము
[140] “ఇబ్రాహీము, ఇస్మాయీలు, ఇస్హాఖు, యాకూబు మరియు వారి సంతానం యూదులుగానో, క్రైస్తవులుగానో ఉన్నారని మీరు అంటున్నారా? ఏమిటీ, మీకు ఎక్కువ తెలుసా లేక అల్లాహ్కు ఎక్కువ తెలుసా?” అని వారిని అడుగు. అల్లాహ్ అప్పగించిన సాక్ష్యాన్ని దాచిపెట్టే వానికన్నా ఎక్కువ అన్యాయస్థుడు ఎవడు కాగలడు? మీ చేష్టల పట్ల అల్లాహ్ అజాగ్రత్తగా లేడు
[141] అది గతించిన ఓ సమాజం. వారు చేసుకున్నది వారికి చెందుతుంది. మీరు చేసుకున్నది మీకు లభిస్తుంది. వారి కర్మల గురించి మీరు ప్రశ్నించబడరు
[142] “వీరు ఏ ఖిబ్లా వైపుకు అభిముఖులయ్యేవారో దాన్నుంచి మరలటానికి కారణం ఏమిటీ?” అని మూర్ఖజనులు అంటారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: తూర్పు పడమరలు (అన్నీ) అల్లాహ్వే. తాను తలచిన వారికి ఆయన రుజుమార్గం చూపుతాడు
[143] అదే విధంగా మేము మిమ్మల్ని ఒక “న్యాయశీల సమాజం” (ఉమ్మతె వసత్)గా చేశాము – మీరు ప్రజలపై సాక్షులుగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీపై సాక్షిగా ఉండటం కోసం (మేమిలా చేశాము.) ప్రవక్తకు విధేయత చూపటంలో ఎవరు నిజాయితీపరులో, మరెవరు వెనుతిరిగి పోయేవారో తెలుసుకునే (పరీక్షించే) నిమిత్తమే మేము, పూర్వం నీవు అభిముఖుడవై ఉండిన దిశను మీ ‘ఖిబ్లా’గా నిర్ధారించాము. ఇదెంతో కష్టమైన విషయమే అయినప్పటికీ అల్లాహ్ సన్మార్గం చూపిన వారికి (ఏ మాత్రం కష్టతరం కాదు). అల్లాహ్ మీ విశ్వాసాన్ని వృధా కానివ్వడు. నిశ్చయంగా అల్లాహ్ (తన దాసులైన) మానవుల యెడల అమితమైన వాత్సల్యం కలవాడు! పరమ కృపాశీలుడు
[144] (ఓ ప్రవక్తా!) నువ్వు నీ ముఖాన్ని మాటిమాటికీ ఆకాశం వైపుకు ఎత్తటం మేము గమనిస్తూనే ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మేము, నువ్వు ఇష్టపడే ఆ దిశ వైపుకే నిన్ను త్రిప్పుతున్నాము. కనుక నువ్వు నీ ముఖాన్ని మస్జిదె హరామ్ వైపుకు త్రిప్పుకో. మీరెక్కడున్నాసరే ఇక మీదట మీ ముఖాలను దాని వైపుకే త్రిప్పాలి. (ఖిబ్లా మార్పుకు సంబంధించిన) ఈ విషయం, తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమేనని గ్రంథం ఇవ్వబడిన వారికి బాగా తెలుసు. అల్లాహ్ వారి కార్యకలాపాల పట్ల అజాగ్రత్తగా లేడు
[145] ఒకవేళ నీవు గ్రంథవహులకు నిదర్శనాలన్నీ చూపినా, వారు నీ ‘ఖిబ్లా’ను అనుసరించరు. వారి ‘ఖిబ్లా’ను అంగీకరించటం అన్నది నీవల్ల కూడా కానిపని. వారిలో కూడా కొందరు మరికొందరి ‘ఖిబ్లా’ను అనుసరించరు. ఒకవేళ నువ్వు- జ్ఞానం వచ్చేసిన తరువాత కూడా – వారి కోరికలను అనుసరించినట్లయితే నువ్వు కూడా దుర్మార్గులలో చేరిపోతావు సుమా
[146] మేము ఎవరికి గ్రంథం వొసగామో వారు తమ కన్న కొడుకులను గుర్తుపట్టినట్లే అతన్ని (అనగా ముహమ్మద్-సఅసం-ను) గుర్తుపడతారు. వారిలోని ఒక సమూహం సత్యాన్ని గుర్తించి కూడా దాన్ని కప్పిపుచ్చుతుంది
[147] అయితే ఇది నీ ప్రభువు తరఫు నుంచి వచ్చిన (స్పష్టమయిన) సత్యం. (జాగ్రత్త!) నీవు మాత్రం సంశయాల్లో ఊగిస లాడేవారి సరసన చేరకు
[148] ప్రతి ఒక్కడూ ఏదో ఒక దిక్కుకు తిరుగుతున్నాడు. కాబట్టి మీరు సత్కార్యాలలో మించిపోయేందుకు ప్రయత్నించండి. మీరు ఎక్కడ ఉన్నాసరే అల్లాహ్ మిమ్మల్ని సమీకరిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతి వస్తువుపై అధికారం కలవాడు
[149] నీవు ఎక్కడి నుంచి బయలుదేరినా (నమాజు కోసం) నీ ముఖాన్ని మస్జిదె హరాం వైపునకు త్రిప్పు. ఇదే నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. మీరు చేసేదంతా అల్లాహ్కు తెలియకుండా లేదు
[150] ఏ స్థలం నుంచి నీవు వెడలినా నీ ముఖాన్ని మజ్జిదె హరాం వైపునకు త్రిప్పు. మీరు ఎక్కడ ఉన్నాసరే, మీ ముఖాలను దాని వైపునకే త్రిప్పండి – జనులు మీతో వాదులాటకు దిగకుండా ఉండటానికి (ఇలాగే చేయండి). వారిలోని దుర్మార్గులకు (వారు ఎలాగూ రాద్ధాంతం చేసేవారే. అంతమాత్రాన మీరు వారికి) భయపడకండి. నాకు మాత్రమే భయపడండి- నేను నా అనుగ్రహాన్ని మీపై సంపూర్తి గావించటానికి, మీరు సన్మార్గగాములు అవటానికి
[151] అదే విధంగా మేము మీ వద్దకు స్వయంగా మీలో నుండే ఒక ప్రవక్తను (నియుక్తం చేసి) పంపాము. అతడు మీకు మా వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు, మిమ్మల్ని పరిశుద్ధుల్ని చేస్తున్నాడు, మీకు గ్రంథజ్ఞానాన్నీ, వివేకవంతమైన విషయాలను బోధిస్తున్నాడు, ఇంకా మీకు తెలియని విషయాలను నేర్పుతున్నాడు
[152] అందుకే మీరు నన్ను స్మరించండి, నేను మిమ్మల్ని జ్ఞాపక ముంచుకుంటాను. నాకు కృతజ్ఞులై ఉండండి. కృతఘ్నతకు పాల్పడకండి
[153] ఓ విశ్వాసులారా! సహనం మరియు నమాజు ద్వారా సహాయం అర్థించండి. అల్లాహ్ సహనం పాటించేవారికి తోడుగా ఉంటాడు
[154] అల్లాహ్ మార్గంలో చంపబడినవారిని మృతులు అని అనకండి. వారు బ్రతికే ఉన్నారు. కాని ఆ విషయం మీకు అర్థం కాదు
[155] మేము ఏదో ఒక విధంగా మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తూ ఉంటాము – భయంతో, ఆకలిదప్పులతో, ధన ప్రాణాల నష్టంతో, పండ్ల కొరతతో (పరీక్షిస్తాము)! ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి
[156] వారికెప్పుడు ఏ ఆపద వచ్చిపడినా, “మేము ఖుద్దుగా అల్లాహ్కు చెందినవారము, మేము మరలిపోవలసింది కూడా ఆయన వద్దకే కదా!” అని అంటారు
[157] వారిపై వారి ప్రభువు దయానుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందినవారు కూడా వీరే
[158] నిస్సందేహంగా సఫా మర్వాలు అల్లాహ్ చిహ్నాలలోనివి. కనుక కాబా గృహాన్ని (సందర్శించి) హజ్ ఉమ్రహ్లు చేసేవారు వాటి మధ్య ప్రదక్షిణ చేస్తే అందులో ఏ మాత్రం తప్పులేదు. స్వచ్ఛందంగా ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అల్లాహ్ ఆదరించేవాడు, తెలుసుకునేవాడు
[159] మేము అవతరింపజేసిన నిదర్శనాలను మరియు సన్మార్గాన్ని ప్రజల కొరకు గ్రంథంలో విశదపరచిన తరువాత కూడా వాటిని దాచిపెట్టే వారిని అల్లాహ్ శపిస్తాడు. ఇంకా, వేరే శపించే వారు కూడా వారిని శపిస్తారు
[160] అయితే పశ్చాత్తాపం చెంది, తమ ప్రవర్తనను సంస్కరించుకుని, సత్యాన్ని బహిర్గతం చేసిన వారి పశ్చాత్తాపాన్ని నేను స్వీకరిస్తాను (వారి తప్పును మన్నిస్తాను). నేను పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాణ్ణి, అపారంగా కనికరించేవాణ్ణి
[161] నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడి, అవిశ్వాస స్థితిలోనే మరణించిన వారిపై అల్లాహ్ మరియు ఆయన దూతల, ఇంకా జనులందరి శాపం పడుతుంది
[162] అందులోనే వారు ఎల్లకాలం ఉంటారు. వారి శిక్షను తగ్గించటం గానీ, వారికి కొంత విడుపు ఇవ్వటంగానీ జరగదు
[163] మీ అందరి ఆరాధ్య దైవం ఒకే ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేనేలేడు. ఆయన అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు
[164] భూమ్యాకాశాల సృష్టిలో, రేయింబవళ్ళ (నిరంతర) మార్పిడిలో, ప్రజలకు లాభం చేకూర్చే వస్తువులను మోసుకుంటూ సముద్రాలలో నడిచే ఓడలలో, ఆకాశం నుంచి అల్లాహ్ వర్షపు నీటిని కురిపించి మృతభూమిని బ్రతికించటంలో, ఇంకా అందులో అన్ని రకాల ప్రాణులను వ్యాపింపజేయటంలో, వీచే పవనాల దిశలు మార్చటంలో, భూమ్యాకాశాల మధ్య (దేవుని) నియమ నిబంధనలకు కట్టుబడి మసలుకుంటున్న మేఘాలలో బుద్ధిమంతులకు (దేవుని శక్తి సామర్థ్యాలకు సంబంధించిన) ఎన్నో సూచనలున్నాయి
[165] కాని అల్లాహ్ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి, అల్లాహ్ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరు ఉన్నారు. అయితే విశ్వసించినవారు అల్లాహ్ను అంతకంటే ప్రగాఢంగా (అధికంగా) ప్రేమిస్తారు. సర్వశక్తులూ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయనీ, అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడన్న యదార్థాన్ని ముష్రిక్కులు, అల్లాహ్ విధించే శిక్షలను చూసిన తరువాత తెలుసుకునే బదులు, ఇప్పుడే తెలుసుకుంటే ఎంత బాగుంటుంది! (తెలుసుకుంటే వారు ఈ షిర్క్ పాపానికి ఒడిగట్టరు)
[166] ఆ సమయంలో, వీళ్ళచేత అనుసరించబడిన నాయకులు తమ అనుచరులతో తమకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తారు. ఇంకా వారు శిక్షను కళ్ళారా చూసుకుంటారు. వారి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలన్నీ తెగిపోతాయి
[167] అప్పుడు (కనువిప్పు కలిగిన) అనుచరులు ఇలా అంటారు: “మేమే గనక మరోసారి ప్రాపంచిక జీవితం వైపుకు మరలించబడటమంటూ జరిగితే వీరు (ఈ అయ్యవార్లు) మా పట్ల ఇక్కడ విసుగును ప్రదర్శించినట్లే మేమూ వీరిపట్ల విసుగును ప్రదర్శించేవారం.” ఈ విధంగా వారు సిగ్గుతో కుంచించుకుపోయే విధంగా అల్లాహ్ వారి కర్మలను వారికి చూపిస్తాడు. అయినాసరే వారు నరకం నుంచి బయట పడటమన్నది అసంభవం
[168] ప్రజలారా! భూమిలోని ధర్మసమ్మతమైన, పవిత్రమైన వస్తువులన్నింటినీ తినండి. కాని షైతాన్ అడుగుజాడలలో మాత్రం నడవకండి. వాడు మీకు బహిరంగ శత్రువు
[169] వాడు మిమ్మల్ని కేవలం చెడు వైపుకు, నీతి బాహ్యత వైపుకు పురికొల్పుతాడు. ఏ విషయాల జ్ఞానం మీకు లేదో వాటిని అల్లాహ్ పేరుతో చెప్పమని మీకు ఆజ్ఞాపిస్తాడు
[170] “అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్ని అనుసరించండి” అని వారికి చెప్పినప్పుడల్లా, “మా తాతలు తండ్రులు అవలంబిస్తూ ఉండగా చూచిన పద్ధతినే మేము పాటిస్తాము” అని వారు సమాధానమిస్తారు. వారి పూర్వీకులు ఒట్టి అవివేకులు, మార్గ విహీనులైనప్పటికీ (వీళ్లు వారినే అనుసరిస్తారన్నమాట)
[171] సత్య తిరస్కారుల ఉపమానం పశువుల కాపరి యొక్క కేకను, అరుపును మాత్రమే వినే పశువుల వంటిది (ఆలోచన అన్నమాటే ఉండదు). వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు. వారు అర్థం చేసుకోరు
[172] ఓ విశ్వసించిన వారలారా! మీరు కేవలం అల్లాహ్ను ఆరాధించేవారే అయితే మేము మీకు ప్రసాదించిన పవిత్రమైన వస్తువులను తినండి, త్రాగండి, అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపండి
[173] అల్లాహ్ మీ కొరకు నిషేధించినవి ఇవే: చచ్చిన జంతువులు, (ప్రవహించిన) రక్తం, పందిమాంసం, ఇంకా అల్లాహ్ తప్ప ఇతరుల పేరు ఉచ్చరించబడినది. ఎవరయినా ఉద్దేశపూర్వకంగా కాకుండా, హద్దులను అతిక్రమించకుండా- గత్యంతరం లేని స్థితిలో – తింటే పాపం కాదు. నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, జాలి చూపేవాడు
[174] అల్లాహ్ తన గ్రంథంలో అవతరింపజేసిన విషయాలను దాచేవారు, వాటిని కొద్దిపాటి ధరకు అమ్ముకునేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. ప్రళయ దినాన అల్లాహ్ వారితో అస్సలు మాట్లాడడు. వారిని పరిశుద్ధపరచడు. పైపెచ్చు వారికి బాధాకరమైన శిక్ష కలదు
[175] అపమార్గాన్ని సన్మార్గానికి బదులుగా, శిక్షను క్షమాభిక్షకు బదులుగా కొనుక్కున్నవారు వీరే. వారు నరకాగ్నిని ఎలా భరిస్తారో
[176] ఇలా ఎందుకు జరిగిందంటే, అల్లాహ్ సత్యంతో కూడుకున్న గ్రంథాన్ని అవతరింపజేయగా, ఈ గ్రంథంతో విభేదించే వారు, తమ పెడసరి ధోరణిలో బహుదూరం వెళ్ళిపోయారు
[177] మీరు మీ ముఖాలను తూర్పు దిక్కుకో, పడమర దిక్కుకో తిప్పటమే సదాచరణ కాదు. సదాచరణ అంటే వాస్తవానికి అల్లాహ్ను, అంతిమ దినాన్నీ, దైవదూతలనూ, దైవగ్రంథాన్నీ, దైవ ప్రవక్తలనూ విశ్వసించటం. ధనప్రీతి ఉన్నప్పటికీ సమీప బంధువులకు, అనాధలకు, అగత్యపరులకు, బాటసారులకు, యాచించే వారికి (ధనాన్ని) ఇవ్వటం, బానిసలకు విముక్తి నొసగటం, నమాజును నెలకొల్పటం, జకాతును చెల్లిస్తూ ఉండటం, ఇచ్చిన మాటను నిలుపుకోవటం, లేమిలో కష్టకాలంలో, యుద్ధ సమయాలలో సహన స్థయిర్యాలను కనబరచటం- ఇవన్నీ కలిగి వున్నవారే వాస్తవానికి సత్యమూర్తులు. భయభక్తులు కలవారు కూడా వీరే
[178] ఓ విశ్వాసులారా! హతుల విషయంలో ప్రతీకార న్యాయం (ఖిసాస్) మీ కొరకు విధిగా నిర్ణయించబడింది. స్వతంత్రునికి బదులుగా స్వతంత్రుణ్ణి, బానిసకు బదులుగా బానిసను, స్త్రీకి బదులుగా స్త్రీని (మాత్రమే) హతమార్చాలి. ఒకవేళ హతుని సోదరుడు హంతకుణ్ణి కనికరించదలిస్తే అతను రక్తశుల్కాన్ని న్యాయసమ్మతంగా అడగాలి. హంతకుడు కూడా రక్తధనాన్ని ఉత్తమ రీతిలో అతనికి చెల్లించాలి. ఇది మీ ప్రభువు తరఫున ఇవ్వబడిన వెసులుబాటు, కారుణ్యం. ఆ తరువాత కూడా ఎవరయినా హద్దులు అతిక్రమిస్తే అతనికి వ్యధాభరితమైన శిక్ష ఉంటుంది
[179] ఓ బుద్ధిమంతులారా! ఈ ప్రతీకార న్యాయంలోనే మీ జీవనం ఉంది – ఇలా ఉంటేనే మీరు (అమానుషాల నుండి) ఆగి ఉంటారు
[180] మీలో ఎవరికయినా మరణ ఘడియలు సమీపించి, వారి వద్ద ఆస్తిపాస్తులున్నట్లయితే, వారు తమ తల్లిదండ్రుల, సమీప బంధువుల పేర ఉత్తమరీతిలో వీలునామా వ్రాసిపోవటం విధిగా చేయబడింది. భయభక్తులు కలవారికి ఈ విధ్యుక్త ధర్మం మరింతగా వర్తిస్తుంది
[181] వీలునామా (వసీయతు గురించి) విన్న తరువాత కూడా ఏ వ్యక్తయినా దాన్ని మార్చివేస్తే ఆ పాపమంతా ఆ మార్చిన వానిపైనే పడుతుంది. వాస్తవానికి అల్లాహ్ వినేవాడు, తెలిసినవాడూను
[182] వీలునామా చేసేవాడు పొరబాటున పక్షపాత వైఖరిని అవలంబించాడనో లేక పాపంతో కూడుకున్న శాసనం చేశాడనో భయపడినవారు సంబంధీకులందరినీ పిలిచి, వారందరి మధ్య రాజీ కుదిరిస్తే అందులో దోషం లేదు. అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు కూడా
[183] ఓ విశ్వసించినవారలారా! ఉపవాసాలుండటం మీపై విధిగా నిర్ణయించబడింది – మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది
[184] అదీ లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే. అయితే మీలో వ్యాధిగ్రస్తులుగానో, ప్రయాణీకులుగానో ఉన్నవారు ఆ ఉపవాసాల లెక్క ఇతర దినాలలో పూర్తి చేసుకోవాలి. స్థోమత ఉన్న వారు (ఉపవాసం పాటించకపోయినందుకు) పరిహారంగా ఒక నిరుపేదకు అన్నం పెట్టాలి. కాని ఎవరైనా స్వచ్ఛందంగా ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే, అది వారికే మేలు. మీరు గ్రహించ గలిగితే ఉపవాసం ఉండటమే మీ కొరకు శ్రేయస్కరం
[185] రమజాను నెల – ఖుర్ఆన్ అవతరింపజేయబడిన నెల. అది మానవులందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతోపాటు, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. కనుక మీలో ఎవరు ఈ నెలను చూస్తారో వారు ఉపవాసాలుండాలి. అయితే రోగగ్రస్తుని గానో, ప్రయాణీకుని గానో ఉన్న వారు ఇతర దినాలలో ఈ లెక్కను పూర్తిచేయాలి. అల్లాహ్ మీకు సౌలభ్యాన్ని సమకూర్చదలుస్తున్నాడేగాని మిమ్మల్ని కష్టపెట్టదలచటం లేదు. మీరు (ఉపవాసాల) నిర్ణీత సంఖ్యను పూర్తిచేసుకోవాలన్నదీ, తాను అనుగ్రహించిన సన్మార్గ భాగ్యానికి ప్రతిగా ఆయన గొప్పతనాన్ని కీర్తించి, తగురీతిలో మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నది అల్లాహ్ అభిలాష
[186] (ఓ ప్రవక్తా!) నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను (వారికి) అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని (నువ్వు వారికి చెప్పు). కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసావహించాలి, నన్ను విశ్వసించాలి (ఈ విషయం నీవు వారికి తెలియజేయి). తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగల్గుతారు
[187] ఉపవాస కాలంలోని రాత్రులలో మీరు మీ భార్యలను కలుసుకోవటం మీ కొరకు ధర్మసమ్మతం చేయబడింది. వారు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు. మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే సంగతి అల్లాహ్కు తెలుసు. అయినప్పటికీ ఆయన క్షమాగుణంతో మీ వైపుకు మరలి, మీ తప్పును మన్నించాడు. ఇకనుంచి మీరు మీ భార్యలతో (ఉపవాసపు రాత్రులందు) రమించడానికీ, అల్లాహ్ మీ కొరకు రాసిపెట్టిన దాన్ని అన్వేషించటానికీ మీకు అనుమతి ఉంది. తొలిజాములోని తెలుపు నడిరేయి నల్లని చారలో నుండి ప్రస్ఫుటం అయ్యే వరకూ తినండి, త్రాగండి. ఆ తరువాత (వీటన్నింటినీ పరిత్యజించి) రాత్రి చీకటి పడేవరకూ ఉపవాసం ఉండండి. ఇంకా – మీరు మస్జిదులలో ‘ఏతెకాఫ్’ పాటించేకాలంలో మాత్రం మీ భార్యలతో సమాగమం జరపకండి. ఇవి అల్లాహ్ (నిర్ధారించిన) హద్దులు. మీరు వాటి దరిదాపులకు కూడా పోకండి. ప్రజలు అప్రమత్తంగా ఉండగలందులకుగాను అల్లాహ్ తన ఆయతులను ఇలా విడమరచి చెబుతున్నాడు
[188] ఒకరి సొమ్మును ఇంకొకరు అన్యాయంగా స్వాహా చేయకండి. బుద్ధిపూర్వకంగా, అక్రమమైన రీతిలో ఇతరుల ఆస్తిలో కొంతభాగం కాజేయటం కోసం అధికారులకు ముడుపులు చెల్లించకండి. అది (న్యాయం కాదన్న సంగతి) మీకూ తెలిసినదే
[189] (ఓ ప్రవక్తా!) ప్రజలు నిన్ను నెలవంకలను గురించి ప్రశ్నిస్తున్నారు కదూ! ఇది ప్రజల (ఆరాధనల) వేళలను, హజ్ కాలాన్ని నిర్ధారించటానికి (జరిగిన ఏర్పాటు) అని నువ్వు వారికి సమాధానం ఇవ్వు. (ఇహ్రామ్ స్థితిలో) మీరు మీ ఇళ్ళల్లోకి వెనుక వైపు నుంచి రావటం సత్కార్యం కాదు. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి వున్నవాడిదే అసలు సత్కార్యం. మీరు మీ ఇండ్లల్లోకి వాకిళ్ళ నుండే ప్రవేశించండి. సాఫల్యం పొందగలందులకుగాను అల్లాహ్కు భయపడుతూ ఉండండి
[190] మీతో పోరాడే వారితో మీరు కూడా దైవమార్గంలో పోరాడండి. కాని మితిమీరకండి. మితిమీరి పోయేవారిని అల్లాహ్ ఇష్టపడడు
[191] వారు ఎక్కడ ఎదురైనా మీరు వారితో తలపడండి, మిమ్మల్ని ఎక్కడి నుంచి వారు తరిమికొట్టారో, అక్కడి నుంచి మీరు కూడా వారిని తరిమికొట్టండి. ఫిత్నా (కుఫ్ర్, షిర్క్, పీడన) అనేది చంపటం కన్నా తీవ్రమైనది. ‘మస్జిదె హరామ్’ వద్ద వారు మీతో యుద్ధం చేయనంతవరకూ మీరూ వారితో పోరాడకండి. వారు గనక మిమ్మల్ని హతమార్చడానికి ప్రయత్నిస్తే మీరు కూడా దీటైన జవాబు ఇవ్వండి. అవిశ్వాసులకు సరైన సమాధానం ఇదే
[192] ఒకవేళ వారు గనక (తమ దమన నీతిని) మానుకుంటే నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు
[193] పీడన (ఫిత్నా) సమసిపోనంతవరకూ, దైవధర్మానిది పైచేయి కానంతవరకూ వారితో పోరాడుతూనే ఉండండి. ఒకవేళ వారు యుద్ధాన్ని విరమిస్తే (మీరూ విరమించండి). మెడలు వంచ వలసింది దౌర్జన్యపరులవే
[194] నిషిద్ధమాసం నిషిద్ధమాసానికి బదులుగా ఉన్నది. నిషేధాజ్ఞలు సరిసమానంగా వర్తిస్తాయి. మీపై ఎవరయినా దౌర్జన్యానికి ఒడిగడితే మీరు కూడా వారిపై ఆ మేరకు ప్రతీకారం తీర్చుకోండి. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. అల్లాహ్ భక్తిగలవారికి తోడుగా ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకోండి
[195] అల్లాహ్ మార్గంలో ఖర్చుపెట్టండి. చేజేతులా మిమ్మల్ని మీరు వినాశం పాలు చేసుకోకండి. ఉత్తమంగా మసలుకోండి. నిస్సందేహంగా అల్లాహ్ ఉత్తమంగా వ్యవహరించేవారిని ప్రేమిస్తాడు
[196] హజ్, ఉమ్రహ్లను అల్లాహ్ కొరకు పూర్తిచేయండి. ఒకవేళ మీరు నిలువరించబడితే, మీరు ఇవ్వగలిగిన ఖుర్బానీని ఇచ్చివేయండి. మీరు ఇచ్చే ఖుర్బానీ, ఖుర్బానీ స్థలానికి చేరనంతవరకూ శిరోముండనం చేయించుకోకండి. అయితే మీలో వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు, లేదా తలలో బాధ ఉన్నవారు (శిరోముండనం చేయించుకుంటే ఫరవాలేదు. కాని వారు) దీనికి పరిహారంగా ఉపవాసం ఉండటమో, దానధర్మాలు చేయటమో, ఖుర్బానీ ఇవ్వటమో చేయాలి. మరి ఆ తర్వాత (చిక్కుల నుంచి, నిలువరింపు నుంచి) ప్రశాంతతను పొంది ఉన్న స్థితిలో మీలో ఎవరయినా ఉమ్రహ్ మొదలుకుని హజ్ వరకు సంకల్పం బూని ప్రయోజనం (తమత్తు) పొందినట్లయితే, వారు తమ వద్దనున్న ఖుర్బానీని ఇచ్చివేయాలి. ఖుర్బానీ ఇవ్వలేనివారు హజ్ దినాలలో మూడు రోజులు ఉపవాసం పాటించాలి. హజ్ నుండి తిరిగి వచ్చిన తరువాత ఏడు రోజులు ఉపవాసముండాలి. ఈ విధంగా మొత్తం పది ఉపవాసాలవుతాయి. మస్జిదె హరామ్కు సమీపంలో ఉండని వారికి మాత్రమే ఈ ఆదేశం వర్తిస్తుంది. (ప్రజలారా!) అల్లాహ్కు భయపడుతూ ఉండండి. అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడన్న సంగతిని తెలుసుకోండి
[197] హజ్ మాసాలు నిర్థారితమై ఉన్నాయి. కనుక ఈ నిర్ణీత మాసాలలో హజ్ను తన కొరకు విధించుకున్న వ్యక్తి – హజ్ దినాలలో – కామ క్రీడలకు, పాపకార్యాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి. మీరు ఏ సత్కార్యం చేసినా దాని గురించి అల్లాహ్కు తెలుసు. (హజ్ యాత్రకు బయలుదేరినప్పుడు) ప్రయాణ సామగ్రి(ఖర్చు)ని వెంటతీసుకెళ్ళండి. అయితే అన్నింటికంటే అత్యుత్తమ సామగ్రి దైవభీతి (అని బాగా గుర్తుంచుకోండి). కనుక ఓ బుద్ధిమంతులారా! నాకు భయపడుతూ ఉండండి
[198] (హజ్ యాత్ర సందర్భంగా) మీరు గనక మీ ప్రభువు అనుగ్రహాన్ని అన్వేషిస్తే అందులో తప్పేమీ లేదు. మీరు అరఫాత్ నుండి తిరిగి వస్తున్నప్పుడు ‘మష్అరె హరామ్’ వద్ద దైవనామాన్ని స్మరించండి – ఆయన సూచించిన విధంగానే ఆయన నామస్మరణ చేయండి. ఇంతకు మునుపైతే మీరు దారి తప్పి ఉన్నారు
[199] తరువాత మీరు ప్రజలందరూ మరలే చోటు నుంచే మరలండి. క్షమాపణకై అల్లాహ్ను వేడుకుంటూ ఉండండి. నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడూను
[200] హజ్ క్రియలన్నింటినీ నిర్వర్తించిన తరువాత అల్లాహ్ను ధ్యానించండి. మీ తాతముత్తాతలను జ్ఞాపకం చేసుకున్నట్లే, ఇంకా అంతకంటే అధికంగానే అల్లాహ్ను జ్ఞాపకం చేయండి. “ఓ ప్రభూ! మాకు ప్రపంచంలోనే ప్రసాదించు” అని ప్రార్థించేవారు కూడా ప్రజల్లో కొందరున్నారు. అటువంటి వారికి పరలోకంలో ఏ భాగమూ లభించదు
[201] ప్రజల్లోనే మరికొందరు, “ప్రభూ! మాకు ప్రపంచంలోనూ మేలును ప్రసాదించు, పరలోకంలో కూడా మేలును ప్రసాదించు. ఇంకా మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు” అని ప్రార్థించేవారు కూడా ఉన్నారు
[202] ఇలాంటి వారికి వారి కర్మలను బట్టి వాటా లభిస్తుంది. అల్లాహ్ వేగంగా లెక్క తీసుకునేవాడు
[203] గణించదగిన ఆ దినాలలో (తష్రీఖ్ దినాలలో) అల్లాహ్ను స్మరించండి. రెండు దినాలలోనే ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేందుకు ఎవరైనా తొందరపాటు కనబరచినా తప్పులేదు. వెనుక ఉండిపోయిన వారు కూడా నిందార్హులు కారు. ఇది భయభక్తులు గల వారికై ఉద్దేశించినది. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. మీరంతా ఆయన వైపుకే సమీకరించబడతారన్న యదార్థాన్ని బాగా తెలుసుకోండి
[204] (ఓ ప్రవక్తా!) ప్రజలలో కొందరు పలికే ప్రాపంచిక ఉద్దేశాలతో కూడుకున్న మాటలు నిన్ను అలరించవచ్చు. వాడు తన ఆంతర్యంలోనున్న అసలు విషయానికి అల్లాహ్ను సాక్షిగా పెడుతున్నాడు. మరి చూడబోతే వాడు పెద్ద తగవులమారి
[205] వాడు (నీ వద్ద నుండి) తిరిగి వెళ్ళిన తరువాత ధరణిలో కల్లోలాన్ని రేకెత్తించడంలో, పంటలను నాశనం చేయడంలో, సంతతిని పాడు చేయటంలో నిమగ్నుడైపోతాడు. కాగా; అల్లాహ్ ఇలాంటి చెడుగును సుతరామూ ఇష్టపడడు
[206] “అల్లాహ్కు భయపడు” అని వాడితో అన్నప్పుడు, వాడి గర్వం, దురభిమానం వాడ్ని పాపం వైపుకే పురికొల్పుతుంది. ఇలాంటి వారికి నరకమే గతి. అది అతి చెడ్డ నివాస స్థలం
[207] ప్రజల్లోని మరి కొంతమంది ఎలాంటివారంటే, దైవ ప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు తమ ప్రాణాలను సయితం పణంగా పెడుతున్నారు. అటువంటి (త్యాగధనులైన) తన దాసుల పట్ల అల్లాహ్ అమితమైన వాత్సల్యం కలిగి ఉంటాడు
[208] ఓ విశ్వాసులారా! ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి. షైతాన్ అడుగు జాడలలో నడవకండి. వాడు మీకు బద్ధవిరోధి
[209] మీ వద్దకు స్పష్టమయిన నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా మీరు ఒకవేళ తప్పటడుగు వేస్తే అల్లాహ్ సర్వశక్తి మంతుడు, వివేక సంపన్నుడన్న సంగతిని బాగా గుర్తుంచుకోండి
[210] ఏమిటీ, అల్లాహ్ మరియు దూతలు స్వయంగా మేఘాల నీడలలో వచ్చి తమ కార్యాన్ని పరిపూర్తిగావిస్తారని వారు ఎదురుచూస్తున్నారా? కార్యాలన్నీ (నిర్ణయం కొరకు) అల్లాహ్ వైపుకే మరలించబడతాయి
[211] మేము ఇస్రాయీల్ వంశస్థులకు ఎన్ని స్పష్టమైన నిదర్శనాలను ప్రసాదించామో వారినే అడగండి. దైవ ప్రసాదితాలు తమ వద్దకు చేరిన తరువాత వాటిని తారుమారు చేసేవారు, అల్లాహ్ కఠినమైన శిక్షలు విధించగలవాడన్న విషయాన్ని విస్మరించరాదు
[212] అవిశ్వాసుల కొరకు ప్రాపంచిక జీవితం ఎంతో సుందరంగా, ఆకర్షణీయంగా మలచబడింది. వారు విశ్వసించిన వారిని అవహేళన చేస్తున్నారు. వాస్తవానికి అల్లాహ్ పట్ల భయభక్తులు గలవారు ప్రళయ దినాన వారికన్నా ఎంతో ఉన్నత స్థితిలో ఉంటారు. అల్లాహ్ తాను తలచిన వారికి లెక్కలేనంతగా ఉపాధిని అనుగ్రహిస్తాడు
[213] మానవులంతా ఒకే సమాజంగా ఉండేవారు. అల్లాహ్ ప్రవక్తలను శుభవార్తనిచ్చే వారుగా, భయపెట్టే వారుగా చేసి పంపాడు. ప్రజల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలపై తీర్పు చేయటానికిగాను వారివెంట (అనగా ప్రవక్తల వెంట) సత్య బద్ధమైన గ్రంథాలను పంపాడు. మరి వాళ్ళే (అనగా ప్రజలే) – స్పష్టమైన ఆదేశాలు వొసగబడిన తరువాత కూడా – పరస్పర వైర భావం, అసూయ మూలంగా అందులో విభేదించుకున్నారు. అందుచేత అల్లాహ్ విశ్వాసులకు ఈ భేదాభిప్రాయం నుండి కూడా తన ఆజ్ఞానుసారం సత్యం వైపుకు దర్శకత్వం వహించాడు. అల్లాహ్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు
[214] ఏమిటీ, మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీకు పూర్వం గతించిన వారికి ఎదురైనటువంటి పరిస్థితులు మీకింకా ఎదురు కానేలేదు. వారిపై కష్టాలు, రోగాలు వచ్చిపడ్డాయి. వారు ఎంతగా కుదిపి వేయబడ్డారంటే, (ఆ ధాటికి తాళలేక) “ఇంతకీ దైవసహాయం ఎప్పుడొస్తుంది?” అని ప్రవక్తలు, వారి సహచరులు ప్రశ్నించసాగారు. “వినండి! దైవ సహాయం సమీపంలోనే ఉంది” (అని వారిని ఓదార్చటం జరిగింది)
[215] తాము ఏం ఖర్చు చెయ్యాలి? అని వారు నిన్ను ప్రశ్నిస్తున్నారు. మీరేం ఖర్చు చేసినా అది మీ తల్లిదండ్రుల కొరకూ, బంధువుల కొరకూ, అనాధల కొరకూ, నిరుపేదలు, బాటసారుల కొరకూ ఖర్చు చేయాలి. మీరు ఏ మేలు చేసినా అల్లాహ్కు దాని గురించి తెలుసు అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు
[216] యుద్ధం చేయటం మీకు కష్టంగా అనిపించినప్పటికీ, అది మీపై విధిగా నిర్ణయించబడింది. మీరు దేన్ని ఇష్టపడటం లేదో అదే మీ పాలిట బహుశా శుభకరం కావచ్చు. అలాగే మీరు మీ కోసం ఎంతగానో కోరుకునే విషయాలే మీ పాలిట హానికరంగా రూపొందవచ్చు. నిజ జ్ఞానం అల్లాహ్కు మాత్రమే ఉంది. మీకు ఆ విషయం తెలియదు
[217] నిషిద్ధ మాసాలలో యుద్ధం చెయ్యటం గురించి ప్రజలు నిన్ను అడుగుతున్నారు. నువ్వు వారికి చెప్పు : ఈ మాసాలలో యుద్ధం చేయటం మహాపరాధం. అయితే అల్లాహ్ మార్గంలో అవరోధాలు కల్పించటం, అల్లాహ్ను తిరస్కరించటం, మస్జిదె హరామ్ను సందర్శించే జనులను అడ్డుకోవటం, అక్కడ నివసించే వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టడం అల్లాహ్ దృష్టిలో అంతకన్నా ఘోరమైన అపరాధం. ఈ ఉపద్రవం (ఫిత్నా) హత్య కన్నా పెద్దది. వారు మీతో యుద్ధం చేస్తూనే ఉంటారు. చివరికి వారికి వీలు కలిగితే మిమ్మల్ని మీ ధర్మం నుంచి మరలించనయినా మరలించేస్తారు. మరి మీలో గనక ఎవరయినా తమ ధర్మం నుంచి తిరిగిపోయి, అవిశ్వాస స్థితిలో మరణిస్తే వారి ఇహపర లోకాల్లోని కర్మలు సర్వనాశనమైపోతాయి. అలాంటి వారే నరకవాసులు. వారందులో కలకాలం పడి ఉంటారు
[218] అయితే విశ్వసించినవారు, హిజ్రత్ చేసిన (వలసపోయిన) వారు, దైవ మార్గంలో పోరాడేవారు మాత్రమే దైవ కారుణ్యానికి అభ్యర్థులు. అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు
[219] ప్రజలు నిన్ను మద్యపానం గురించి, జూదం గురించి ప్రశ్నిస్తున్నారు. నువ్వు వారికి చెప్పు: “రెండింటిలోనూ చాలా పెద్ద పాపం ఉంది. ప్రజలకు దీనివల్ల కొన్ని ప్రాపంచిక లాభాలు కూడా చేకూరుతాయి. కాని వీటి ద్వారా చేకూరే లాభం కన్నా పాపం చాలా ఎక్కువ.” ఏం ఖర్చు పెట్టాలి? అని వారు నిన్ను అడుగుతారు. ‘మీ ఖర్చులు పోగా మిగిలినది’ అని నువ్వు వారికి చెప్పు. మీరు యోచన చేసేటందుకు గాను అల్లాహ్ ఈ విధంగా తన ఆదేశాలను స్పష్టంగా వివరిస్తున్నాడు
[220] ఇహలోక జీవితంలో, పరలోకంలో కూడా. ఇంకా వీరు అనాధలను గురించి కూడా నిన్ను ప్రశ్నిస్తున్నారు కదూ! వారికి బోధపరచు: వారి బాగోగులను అభిలషించటం ఉత్తమం. (బాగు పరచే ఉద్దేశంతో) ఒకవేళ మీరు వారి సొమ్మును మీ సొమ్ములో కలుపుకుంటే వారూ మీ సహోదరులే. చెడగొట్టేవారెవరో, బాగు పరచేవారెవరో అల్లాహ్కు బాగా తెలుసు. అల్లాహ్యే గనక తలిస్తే మిమ్మల్ని కష్టాల్లో పడవేసేవాడే. నిశ్చయంగా అల్లాహ్ శక్తిమంతుడు, వివేకవంతుడు
[221] దైవానికి భాగస్వామ్యం కల్పించే స్త్రీలు విశ్వసించి ముస్లింలు కానంతవరకూ మీరు వారిని వివాహమాడకండి. దైవానికి భాగస్వామ్యం కల్పించే స్వతంత్ర స్త్రీ మీకు ఎంతగా నచ్చినప్పటికీ ఆమెకన్నా అల్లాహ్ను విశ్వసించే ఒక బానిస స్త్రీ ఎంతో ఉత్తమురాలు. (అలాగే) షిర్కుకు ఒడిగట్టే పురుషులు విశ్వసించనంతవరకూ మీ స్త్రీలను వారి వివాహ బంధంలోకి ఇవ్వకండి. ఎందుకంటే షిర్కుకు పాల్పడే పురుషుడు మీకు నచ్చినప్పటికీ అతనికంటే విశ్వసించిన ఒక బానిస పురుషుడు ఎన్నో రెట్లు నయం. వీరు (మిమ్మల్ని) నరకం వైపుకు పిలుస్తున్నారు. కాని అల్లాహ్ తన అనుజ్ఞతో స్వర్గం వైపునకూ, క్షమాభిక్ష వైపునకూ పిలుస్తున్నాడు. ప్రజలు గుణపాఠం నేర్చుకునేందుకుగాను ఆయన తన ఆయతులను విడమరచి మరీ చెబుతున్నాడు
[222] వారు నిన్ను బహిష్టు గురించి ప్రశ్నిస్తున్నారు. నువ్వు వారికి చెప్పు: అదొక అశుద్ధ స్థితి. కనుక అశుద్ధావస్థలో వారికి ఎడంగా ఉండండి. వారు పరిశుద్ధులయ్యేవరకు వారివద్దకు పోకండి. వారు పరిశుద్ధత నొందిన మీదట, అల్లాహ్ అనుమతించిన స్థానం నుంచి మీరు వారితో సమాగమం జరుపవచ్చు. అల్లాహ్ పశ్చాత్తాపపడేవారిని, పారిశుద్ధ్యాన్ని అవలంబించేవారిని ఇష్టపడతాడు
[223] మీ స్త్రీలు మీ పంటపొలాలు. కాబట్టి మీ పొలాల్లోకి మీరు కోరిన విధంగా రండి. మీ స్వయం కోసం (సత్కర్మలను) ముందుకు పంపండి. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. మీరు ఆయన్ని కలుసుకోవలసి ఉందన్న విషయాన్ని గ్రహించండి. (ఓ ప్రవక్తా!) విశ్వాసులకు శుభవార్తను వినిపించు
[224] సత్కార్యాన్నీ, భయభక్తులనూ, మానవుల మధ్య సంస్కరణను విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడేలా – మీరు అల్లాహ్ను మీ ‘ప్రమాణా’లకు లక్ష్యంగా పెట్టకండి. అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు
[225] అనాలోచిత ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని నిలదీయడు. హృదయపూర్వకంగా మీరు చేసే ప్రమాణాలను గురించి మాత్రం ఆయన తప్పకుండా నిలదీసి అడుగుతాడు. అల్లాహ్ క్షమాశీలి, సహనశీలి కూడా
[226] ఎవరయితే తమ భార్యలతో సంబంధం పెట్టుకోబోమని ఒట్టేసుకుంటారో వారి కొరకు నాలుగు మాసాల గడువు ఉంది. మరి వారు గనక (ఈలోగా) మరలివస్తే అల్లాహ్ కూడా క్షమించేవాడు, జాలి చూపేవాడు
[227] ఒకవేళ వారు విడాకులు ఇవ్వాలనే నిశ్చయించుకుంటే, నిస్సందేహంగా అల్లాహ్ అన్నీ వినేవాడు, అంతా తెలిసినవాడు
[228] విడాకులు పొందిన స్త్రీలు తమను తాము మూడు రుతువుల దాకా ఆపి ఉంచుకోవాలి. వారు అల్లాహ్ను, అంతిమదినాన్నీ విశ్వసించేవారే అయితే అల్లాహ్ వారి గర్భాలలో సృష్టించిన దానిని దాచి ఉంచటం వారికి ధర్మ సమ్మతంకాదు. ఒకవేళ ఈ గడువు లోపల వారిని తిరిగి రప్పించుకోవాలన్న సదుద్దేశం భర్తలకు ఉంటే ధర్మం ప్రకారం అలా రప్పించుకునే హక్కు వారికి ఉంది. భర్తలకు స్త్రీలపై హక్కులున్నట్లే స్త్రీలకు కూడా వారిపై హక్కులున్నాయి – కాని ఉత్తమ రీతిలో! కాకపోతే పురుషులకు స్త్రీలపై ఒకింత ప్రాధాన్యత ఉంది. అల్లాహ్ సర్వాధికుడు, వివేచనాపరుడు
[229] ఈ విడాకులు రెండుసార్లే. ఆ తరువాత సక్రమంగా (ఆమెను) ఆపుకోవాలి. లేదంటే ఉత్తమ రీతిలో వదలి పెట్టాలి. మీరు వారికి ఇంతకు ముందు ఇచ్చి ఉన్న వాటిలో నుంచి దేన్నయినా తిరిగి తీసుకోవటం ధర్మసమ్మతం కాదు. ఆఁ ఒకవేళ అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేమన్న భయం వారిరువురికీ ఉంటే అది వేరే విషయం. అందువల్ల దంపతులిద్దరూ అల్లాహ్ ఏర్పరచిన హద్దులకు కట్టుబడి ఉండలేరన్న భయం మీకు కలిగి, అదే సమయంలో స్త్రీ తన భర్తకు కొంత నష్టపరిహారం ఇచ్చి వేర్పడదలిస్తే – అట్టి పరిస్థితిలో ఇరువురిపై ఎలాంటి దోషంలేదు. ఇవి అల్లాహ్ నిర్ధారించిన హద్దులు. (జాగ్రత్త!) వాటిని దాటకూడదు. ఎవరు అల్లాహ్ నిర్థారించిన హద్దులను మీరిపోతారో వారే దుర్మార్గులు
[230] మరి ఆమెకు (మూడవసారి) గనక విడాకులిస్తే, ఆ స్త్రీ ఇతనిని తప్ప వేరొక వ్యక్తిని వివాహం చేసుకోనంతవరకూ ఇతని కోసం ఆమె ధర్మసమ్మతం కాజాలదు. ఆ తరువాత అతను (రెండవ భర్త) కూడా ఆమెకు విడాకులిస్తే, మళ్ళీ వీరిద్దరూ అల్లాహ్ (విధించిన) హద్దులకు కట్టుబడి ఉండగలమన్న నమ్మకం ఉండి వివాహ బంధంలోకి రాదలిస్తే అందులో తప్పులేదు. ఇవి అల్లాహ్ విధించిన హద్దులు. తెలుసుకోగలవారికి ఆయన వీటిని స్పష్టపరుస్తున్నాడు
[231] మీరు స్త్రీలకు విడాకులు ఇచ్చినప్పుడు, వారి గడువు (ఇద్దత్) ముగియనుండగా వారిని సహృదయంతో మీ వద్ద ఆపి ఉంచుకోండి. లేదంటే ఉత్తమ రీతిలో సాగనంపండి. వారిపై దౌర్జన్యానికి ఒడిగట్టే ఉద్దేశంతో వారిని ఆపి ఉంచుకొని వేధించకండి. ఈ వైఖరిని అనుసరించినవాడు నిజానికి తనకు తానే అన్యాయం చేసుకున్నాడు. దైవాదేశాలతో పరిహాసమాడకండి. అల్లాహ్ మీకు చేసిన ఉపకారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. మీపై గ్రంథాన్ని, హిక్మత్ను (ప్రవక్త సంప్రదాయాన్ని, ధర్మశాస్త్రాన్ని) అవతరింపజేసి, మీకు చేసిన ఉపదేశాన్ని కూడా (అవలోకనం చేసుకోండి). అల్లాహ్ యెడల భయభక్తులు కలిగి ఉండండి. అల్లాహ్కు ప్రతిదీ తెలుసు అన్న విషయాన్ని మీరు తెలుసుకోండి
[232] మీరు స్త్రీలకు విడాకులు ఇచ్చిన తరువాత, వారు తమ గడువు (ఇద్దత్)ను ముగించి, తమ (మాజీ) భర్తలను ధర్మబద్ధంగా పరస్పరం ఇష్టపడి వివాహమాడదలిస్తే మీరు వారికి అడ్డు తగలకండి. మీలో ఎవరయితే అల్లాహ్ను, అంతిమదినాన్నీ విశ్వసిస్తున్నారో వారికి ఈ ఉపదేశం చేయబడుతోంది. ఇందులోనే మీ పరిశుద్ధత, పరిశుభ్రత ఇమిడి ఉన్నాయి. అంతా అల్లాహ్కు తెలుసు, మీకు తెలియదు
[233] పాల గడువును పూర్తి చేయాలని (తండ్రులు) కోరినపక్షంలో తల్లులు తమ పిల్లలకు పూర్తిగా రెండు సంవత్సరాలపాటు పాలు పట్టాలి. బిడ్డల తండ్రులపై పోషణాభారం ఉంటుంది. కనుక వారు వారికి ఉత్తమ రీతిలో అన్నవస్త్రాలను సమకూర్చాలి. ఎవరిపైనా శక్తికి మించిన భారం వేయబడదు. బిడ్డ మూలంగా తల్లిని వేధించటంగానీ, సంతానం కారణంగా తండ్రిని ముప్పు తిప్పలు పెట్టడంగానీ చేయరాదు. వారసులపై కూడా ఇటువంటి బాధ్యతే ఉంటుంది. ఒకవేళ ఉభయులూ (తల్లిదండ్రులు) తమ ఇష్టపూర్వకంగా, పరస్పర సంప్రతింపులతో పాలు విడిపించదలిస్తే వారు నిందార్హులు కారు. ఒకవేళ మీ సంతానానికి పాలు పట్టాలన్నదే మీ అభిలాష అయితే అందులోనూ దోషంలేదు. అయితే మీరు ఆమెకు సముచితమైన రీతిలో ఇవ్వవలసిన దాన్ని ఇవ్వండి. అల్లాహ్కు భయపడుతూ మసలుకోండి. అల్లాహ్ మీ కార్యకలాపాలన్నింటినీ గమనిస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకోండి
[234] మీలో ఎవరయినా మరణించి, వారు భార్యలను వదలిపోతే అటువంటి స్త్రీలు నాలుగు మాసాల పది రోజుల వరకూ తమను తాము గడువు (ఇద్దత్)లో ఆపుకోవాలి. గడువు ముగిసిన తరువాత వారు సంస్కారవంతమైన పద్ధతిలో తమ కొరకు మంచిదనుకున్న కార్యమేదయినా చేసుకుంటే అందులో మీపై దోషం ఏమీలేదు. మీరు ఏమేం చేస్తున్నారో అల్లాహ్కు అంతా తెలుసు
[235] ఆ స్త్రీలను (వితంతువులను) నికాహ్ చేసుకోవాలన్న మీ సంకల్పాన్ని సూచనా ప్రాయంగా వారికి తెలియజేసినా లేక మీ ఉద్దేశాన్ని మీ గుండెల్లోనే దాచుకున్నా అందులో తప్పేమీలేదు. మీరు తప్పకుండా వారి గురించి ప్రస్తావిస్తారన్న సంగతి అల్లాహ్కు తెలుసు. అయితే మీరు వారికి లోపాయికారిగా వాగ్దానాలు చేయకండి. ధర్మయుక్తంగా ఏదన్నా చెబితే అది వేరే విషయం! కాని ఇద్దత్ (గడువు) కాలం ముగియనిదే నికాహ్ ఒప్పందాన్ని నిశ్చయం చేయకండి. మీ ఆంతర్యాల్లో దాగి వున్న విషయాలను సయితం అల్లాహ్ తెలుసుకుంటాడని మరువకండి. కనుక ఆయన పట్ల అప్రమత్తంగా ఉండండి. అల్లాహ్ క్షమించేవాడు, సహనశీలి అని కూడా తెలుసుకోండి
[236] ఒకవేళ మీరు స్త్రీలను తాకకుండా, వారి మహర్ను నిర్ధారించకుండానే వారికి విడాకులిస్తే అది కూడా మీకు పాపం కాదు. అయితే వారికి ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చండి. స్థితిమంతుడు తన స్థితికి తగినట్లుగా, పేదవాడు తన స్థోమతకు తగినట్లుగా ధర్మం ప్రకారం ప్రయోజనం చేకూర్చాలి. ఉత్తమంగా వ్యవహరించేవారికి ఇది విధిగా నిర్ణయించబడింది
[237] మీరు స్త్రీలను ముట్టుకోక ముందే విడాకులిచ్చేస్తే, అప్పటికే వారి ‘మహర్’ సొమ్ము కూడా నిర్ణయించబడి ఉంటే, నిర్ణీత మహర్లో సగం సొమ్ము వారికి ఇవ్వండి. ఒకవేళ వారు (స్త్రీలు) ఆ సొమ్మును కూడా మన్నించి వదలిపెడితే లేక వివాహ బంధం తన చేతిలో ఉన్న వ్యక్తి (పురుషుడు తాను పెళ్ళి సందర్భంగా యిచ్చిన మహర్ సొమ్మును) క్షమించివేస్తే అది వేరే విషయం. మీ మన్నింపుల వైఖరి దైవభక్తికి చాలా సన్నిహిత మైనది. ఒండొకరి పట్ల ఔదార్యం చూపటాన్ని విస్మరించకండి. నిస్సందేహంగా అల్లాహ్ మీ కర్మలను గమనిస్తూనే ఉన్నాడు
[238] నమాజులను కాపాడుకోండి, ముఖ్యంగా మధ్యలో వున్న నమాజును. అల్లాహ్ సమక్షంలో వినమ్రులై నిలబడండి
[239] పరిస్థితులు భయానకంగా ఉన్నప్పుడు నడుస్తూనో లేక వాహనంపై పోతూనో (నమాజు చేయండి). శాంతిభద్రతలు నెలకొన్న తరువాత అల్లాహ్ మీకు బోధించిన విధంగా ఆయన్ని ధ్యానించండి. దాని గురించి అంతకుముందు మీకు తెలీదు
[240] మీలో ఎవరయినా చనిపోయి, వారు తమ భార్యలను వదలిపోతే, వారు ఒక ఏడాది కాలంపాటు ప్రయోజనం పొందేలా, వారిని ఎవరూ ఇండ్ల నుంచి గెంటివేయకుండా ఉండేలా వీలునామా వ్రాయాలి. ఒకవేళ వారు తమంతట తాముగా వెళ్ళిపోయి, తమ విషయంలో ధర్మసమ్మతంగా ఏమి చేసినా దానికి మీరు నిందార్హులు కారు. అల్లాహ్ సర్వాధికుడు, వివేచనాపరుడు
[241] విడాకులు పొందిన మహిళలకు సముచిత మేలు చేయటం భావ్యం. ఇది దైవభీతిపరులపై విధిగా చేయబడింది
[242] మీరు అర్థం చేసుకుని బుద్ధిగా మసలుకునేందుకుగాను అల్లాహ్ ఈ విధంగా తన ఆయతులను (ఆజ్ఞలను) మీకు విశద పరుస్తున్నాడు
[243] వేల సంఖ్యలో ఉండి కూడా మరణ భీతితో ఇల్లూ వాకిలీ వదలిపోవడానికి సిద్ధమైన వారిని నీవు చూడలేదా? అల్లాహ్ వారితో “చావండి” అని అన్నాడు. మరి వారిని తిరిగి బ్రతికించాడు. నిస్సందేహంగా అల్లాహ్ జనుల పట్ల దయగలవాడు. కాని వారిలో అత్యధికులు కృతజ్ఞత చూపరు
[244] అల్లాహ్ మార్గంలో పోరాడండి. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడన్న విషయాన్ని మీరు తెలుసుకోండి
[245] అల్లాహ్కు మంచి రుణం ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? దాన్ని ఆయన ఎన్నోరెట్లు పెంచి తిరిగి ఇస్తాడు. (ఉపాధిని) తగ్గించేవాడు, పెంచేవాడు అల్లాహ్యే. కడకు మీరంతా మరలి పోవలసింది ఆయన వైపుకే
[246] మూసా తరువాత ఇస్రాయీలు సంతతి పెద్దల (రెండు నాల్కల ధోరణి)ని గురించి నువ్వు ఆలోచించావా? “మేము దైవమార్గంలో పోరాడేందుకుగాను మాకోసం ఎవరినయినా రాజుగా నియమించండి” అని వారు తమ ప్రవక్తను కోరారు. దానికి ఆ ప్రవక్త, “తీరా యుద్ధం విధించబడ్డాక మీరు వెనుకంజ వేస్తారేమో!” అని అన్నాడు. దానికి వారు, “మేము ఇప్పటికే ఇళ్లనుంచి తరిమివేయబడ్డాము. మా పిల్లలకు దూరం చేయబడ్డాము. అలాంటప్పుడు మేము దైవమార్గంలో పోరాడకుండా ఉండటం అనేది ఎలా సాధ్యం?” అని (కడు గంభీరంగా) పలికారు. తీరా యుద్ధం విధిగా చేయబడినప్పుడు, వారిలో కొద్ది మంది మినహా మిగిలిన వారంతా వెన్నుచూపారు. అల్లాహ్ దుర్మార్గులను బాగా ఎరుగు
[247] “అల్లాహ్ తాలూత్ను మీ రాజుగా నియమించాడని” వారి ప్రవక్త వారికి తెలియజేసినప్పుడు, “అతని అధికారం మాపై ఎలా నడుస్తుంది? రాజ్యాధికారానికి అతనికన్నా ఎక్కువ హక్కు దారులము మేమాయె! కనీసం అతనికి సిరిసంపదల్లో కూడా విస్తృతి వొసగబడలేదు” అని (సాకులు) చెప్పసాగారు. ప్రవక్త వారికి ఇలా నచ్చజెప్పాడు: “(చూడండి!) అల్లాహ్ అతన్నే మీపై (నాయకునిగా) ఎన్నుకున్నాడు. జ్ఞానపరంగా, శారీరకంగా కూడా అతనికి ఆధిక్యతను ప్రసాదించాడు. అల్లాహ్ తాను కోరిన వారికి రాజ్యాధికారం ఇస్తాడు. అల్లాహ్ విశాల సంపన్నుడు, జ్ఞాన సంపన్నుడు కూడా!”
[248] వారి ప్రవక్త వారికి మళ్ళీ ఈ విధంగా నచ్చజెప్పాడు: అతని రాజరికానికి సంబంధించిన బహిరంగ నిదర్శనం ఏమిటంటే (అతని ఏలుబడిలో) మీ వద్దకు ఆ (శుభసూచకాల) పెట్టె తిరిగి వస్తుంది. అందులో మీ ప్రభువు తరఫున మీకు గుండె నిబ్బరం ఉంది. మూసా, హారూన్ కుటుంబీకులు వదలి వెళ్ళిన అవశేషాలు కూడా అందులో ఉన్నాయి. దాన్ని దూతలు మోసుకువస్తారు. మీరే గనక విశ్వసించిన వారైతే ఇందులో మీ కొరకు స్పష్టమయిన సూచన ఉంది
[249] తాలూత్ సైన్యాన్ని తీసుకుని బయలుదేరినప్పుడు ఇలా ప్రకటించాడు : “చూడండి! అల్లాహ్ మిమ్మల్ని ఒక కాలువ ద్వారా పరీక్షించబోతున్నాడు. అందులోని నీళ్ళను త్రాగినవాడు నా వాడు కాడు. త్రాగనివాడు మాత్రమే నా వాడు. చేత్తో గుక్కెడు నీరు తీసుకుని త్రాగితే ఫరవాలేదు.” కాని కొద్దిమంది తప్ప మిగిలిన వారంతా ఆ నీళ్ళను (కడుపునిండా) త్రాగేశారు. తాలూత్ విశ్వాసులైన తన సైన్యంతో కాలువ దాటి ముందుకు పోతున్నప్పుడు, “జాలూత్తో, అతని సైన్యంతో తలపడే శక్తి ఈ రోజు మాలో లేదు” అని వారన్నారు. కాని అల్లాహ్ను కలుసుకోవలసి ఉందనే విషయంపై దృఢవిశ్వాసం గల కొంతమంది ఇలా అన్నారు : “ఒక చిన్న వర్గం, ఒక పెద్ద వర్గాన్ని, దైవాజ్ఞతో జయించటం ఎన్నోసార్లు జరిగింది.” అల్లాహ్ సహనం చూపే వారికి అండగా నిలుస్తాడు
[250] జాలూత్తో, అతని సైన్యంతో ముఖాముఖీ అయినప్పుడు వారు ఇలా ప్రార్థించారు: “ప్రభూ! మాకు సహన స్థయిర్యాలు ప్రసాదించు. మా కాళ్లకు నిలకడను ఇవ్వు. అవిశ్వాస జనులపై (జరిగే పోరాటంలో) మాకు తోడ్పడు.”
[251] కడకు అల్లాహ్ అనుజ్ఞతో వారు (జాలూత్ సైన్యాన్ని) ఓడించారు. దావూద్ జాలూత్ను సంహరించాడు. మరి అల్లాహ్ దావూద్కు రాజ్యాధికారాన్నీ, వివేచననూ ఒసగాడు. ఇంకా, తాను కోరినంత జ్ఞానాన్ని కూడా ఆయనకు ప్రసాదించాడు. అల్లాహ్ గనక కొందరిని మరికొందరి ద్వారా ఈ విధంగా తొలగించకపోతే భువిలో కల్లోలం రేకెత్తి ఉండేది. కాని అల్లాహ్ లోకవాసులపై ఎంతో దయానుగ్రహం కలవాడు
[252] ఇవి అల్లాహ్ ఆయతులు. వీటిని మేము సత్యబద్ధంగా నీకు వినిపిస్తున్నాము. (ఓ ముహమ్మద్!) నిస్సందేహంగా నువ్వు దైవసందేశహరులలోని వాడవు
[253] వీరు దైవప్రవక్తలు. వీరిలో కొందరికి మరికొందరిపై మేము ప్రాధాన్యతను వొసగాము. వీరిలో కొందరితో అల్లాహ్ సంభాషించాడు. కొందరి తరగతులను ఉన్నతం చేశాడు. ఇంకా మేము మర్యమ్ కుమారుడగు ఈసాకు స్పష్టమైన సూచనలు ప్రసాదించాము. పరిశుద్ధాత్మ ద్వారా అతనికి తోడ్పాటునందించాము. ఒకవేళ అల్లాహ్యే గనక తలిస్తే వీరి తరువాత స్పష్టమయిన నిదర్శనాలు చూసిన ప్రజలు పరస్పరం తగవులాడుకునేవారు కాదు. కాని వారు విభేదాల్లో పడిపోయారు. వారిలో కొందరు విశ్వసించగా, మరి కొందరు అవిశ్వాసులుగా ఉండిపోయారు. అల్లాహ్ గనక కోరితే వీరు పరస్పరం కలహించుకునే వారు కారు. కాని అల్లాహ్ మాత్రం తాను తలచిందే చేస్తాడు
[254] ఓ విశ్వాసులారా! వ్యాపార లావాదేవీలుగానీ, స్నేహబంధాలుగానీ, సిఫార్సులుగానీ ఉండని ఆ రోజు రాకముందే మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చుచేయండి. వాస్తవానికి తిరస్కారులే దుర్మార్గులు
[255] అల్లాహ్ (మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం). ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు. ఆయన సజీవుడు; అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకుగానీ, నిద్రగానీ పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన అధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానినీ, వెనుక ఉన్నదానిని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్యపరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం భూమ్యాకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు
[256] ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమయ్యింది. కనుక ఎవరయితే అల్లాహ్ తప్ప వేరితర ఆరాధ్యులను (తాగూత్ను) తిరస్కరించి అల్లాహ్ను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ తెగదు. అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు
[257] విశ్వసించినవారి సంరక్షకునిగా స్వయంగా అల్లాహ్ ఉంటాడు. ఆయన వారిని చీకట్ల నుంచి వెలుగు వైపుకు తీసుకుపోతాడు. కాగా; అవిశ్వాసుల నేస్తాలు షైతానులే (తాగూతే). వాళ్లు వారిని వెలుగు నుంచి చీకట్ల వైపుకు లాక్కు పోతారు. వారు నరకవాసులు, కలకాలం అందులోనే పడి ఉంటారు
[258] అల్లాహ్ తనకు రాజ్యాధికారం ఇచ్చాడని (గర్వం కొద్దీ) ఇబ్రాహీంతో అతని ప్రభువు (ఎవరన్న) విషయంపై గొడవపడిన వానిని నీవు చూడలేదా? “జీవన్మరణాలను ఇచ్చేవాడు నా ప్రభువు” అని ఇబ్రాహీం అన్నప్పుడు, “నేనూ బ్రతికిస్తాను, చంపుతాను” అని అతనన్నాడు. అప్పుడు ఇబ్రాహీం (అలైహిస్సలాం), “సరే! అల్లాహ్ సూర్యుణ్ణి తూర్పు వైపు నుంచి ఉదయింపజేస్తున్నాడు కదా! మరి నువ్వు దాన్ని కాస్త పడమటి వైపు నుంచి ఉదయింపజెయ్యి” అని కోరినప్పుడు ఆ దైవతిరస్కారి బిత్తరపోయాడు. యదార్థమేమిటంటే అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు
[259] లేదా ఇండ్ల కప్పులు కూలి తలక్రిందులుగా పడివున్న పట్టణం మీదుగా పోయినవాడు; (అతనిని నీవు చూడలేదా?) “దీని చావు తరువాత అల్లాహ్ తిరిగి దీనికి ఎలా ప్రాణం పోస్తాడు?” అని ఆ వ్యక్తి ఆశ్చర్యపోయినప్పుడు అల్లాహ్ అతన్ని చంపి నూరేళ్ళవరకు మరణస్థితిలో ఉంచాడు. తరువాత అతన్ని లేపి, “ఈ స్థితిలో నువ్వు ఎంతకాలం ఉన్నావు?” అని అడిగాడు. “మహా అయితే ఒక రోజు లేక ఒక రోజులో కొంత భాగం” అని అతను బదులిచ్చాడు. “లేదు. నువ్వు నూరేళ్ళు ఈ స్థితిలో పడిఉన్నావు. కాస్త నీ అన్నపానీయాల వైపు చూడు. అవి ఏ మాత్రం చెడిపోలేదు. మరి నీ గాడిదను కూడా చూసుకో. మేము నిన్ను ప్రజల కోసం ఒక నిదర్శనంగా చేయదలిచాము. మేము (గాడిద) ఎముకలను ఏ విధంగా లేపి, వాటిపై మాంసం నింపుతామో చూడు! ఇదంతా ప్రస్ఫుటమయి పోయాక, “అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడని నాకు తెలుసు” అని అన్నాడతను
[260] (మరొక సంఘటన.) “ఓ ప్రభూ! నీవు మృతులను ఎలా బ్రతికిస్తావో కాస్త నాకు చూపవా?” అని ఇబ్రాహీం విన్నవించుకున్నప్పుడు, “నీకు నమ్మకం లేదా?” అని దేవుని తరఫున సెలవీయబడింది. “ఎందుకు లేదు?! (నాకు పూర్తి నమ్మకం ఉంది. కాకపోతే) ఆత్మ తృప్తికై ఇలా అడిగాను” అని అతనన్నాడు. అప్పుడు అల్లాహ్, “నాలుగు పక్షులను తీసుకో. వాటిని మచ్చిక చేసుకో. (వాటిని కోసి ముక్కలు ముక్కలుగా చెయ్యి). తరువాత ఒక్కో పర్వతంపై దాని ఒక్కో (మాంసపు) ముక్కను ఉంచు. ఆపైన వాటిని పిలువు. అవి నీ వద్దకు పరుగెత్తుకుంటూ వస్తాయి. అల్లాహ్ సర్వశక్తిమంతుడు, వివేకవంతుడన్న సంగతిని బాగా తెలుసుకో” అని అన్నాడు
[261] అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని ఖర్చుచేసేవారి ఉపమానం ఇలా ఉంటుంది: ఒక విత్తనాన్ని నాటగా, అది మొలకెత్తి అందులో నుంచి ఏడు వెన్నులు పుట్టుకువస్తాయి. ప్రతి వెన్నులోనూ నూరేసి గింజలు ఉంటాయి. ఇదే విధంగా అల్లాహ్ తాను కోరినవారికి సమృద్ధి వొసగుతాడు. అల్లాహ్ పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతిదీ తెలిసినవాడు
[262] ఎవరయితే దైవమార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసిన తరువాత తమ దాతృత్వాన్ని మాటిమాటికీ చాటుతూ ఉండకుండా, (గ్రహీతల మనస్సును) నొప్పించకుండా జాగ్రత్త పడతారో, వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంటుంది. వారికెలాంటి భీతిగానీ, దుఃఖంగానీ ఉండదు
[263] దానం చేసిన తరువాత మనసు నొప్పించటం కంటే మంచి మాట పలకటం, క్షమించటం ఎంతో మేలు. అల్లాహ్ అక్కరలేనివాడు, సహనశీలుడు
[264] ఓ విశ్వాసులారా! తన ధనాన్ని పరుల మెప్పుకోసం ఖర్చుచేస్తూ, అల్లాహ్ను గానీ, అంతిమదినాన్ని గానీ విశ్వసించని వ్యక్తి మాదిరిగా మీరు మీ ఉపకారాన్ని చాటుకుని, (గ్రహీతల) మనస్సులను నొప్పించి మీ దానధర్మాలను వృధా చేసుకోకండి. అతని ఉపమానం కొద్దిగా మట్టి పేరుకుని ఉన్న నున్నని రాతి బండ వంటిది. దానిపై భారీవర్షం కురిసి, ఆ మట్టి కాస్తా కొట్టుకు పోయి, కటికరాయి మాత్రమే మిగులుతుంది. ఈ ప్రదర్శనా కారులకు తాము చేసుకున్న దానిలో నుంచి ఏమీ ప్రాప్తించదు. అల్లాహ్ సత్యతిరస్కారులకు సన్మార్గం చూపడు
[265] ఇక దైవప్రసన్నతను చూరగొనే తపనతో, దృఢనమ్మకంతో తమ సంపదను ఖర్చుపెట్టేవారి ఉపమానం మెరక ప్రాంతంలో ఉన్న తోట వంటిది. భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటను ఇస్తుంది. ఒకవేళ దానిపై పెద్ద వర్షం పడకుండా, కేవలం వానజల్లు కురిసినా సరిపోతుంది. అల్లాహ్ మీ పనులన్నింటినీ చూస్తూనే ఉన్నాడు
[266] మీలో ఎవరికయినా ఖర్జూరం, ద్రాక్ష పండ్ల తోట ఉండి, అందులో పిల్ల కాలువలు ప్రవహిస్తూ, అందులో అతనికి అన్ని రకాల ఫలాలు కూడా లభిస్తూ ఉండి, అతను ముసలివాడైపోగా, మరోవైపు అతని పిల్లలు బలహీనులుగా ఉండగా – అకస్మాత్తుగా ఆ తోటపై నిప్పులు చెరిగే వడగాలి వచ్చి ఆ తోట కాలిపోవటాన్ని మీలో ఎవరయినాసరే ఇష్టపడతారా? మీరు ఆలోచించేటందుకుగాను అల్లాహ్ ఈ విధంగా తన ఆయతులను మీకు స్పష్టపరుస్తున్నాడు
[267] ఓ విశ్వసించినవారలారా! ధర్మ సమ్మతమైన మీ సంపాదనలో నుంచి, మేము మీ కోసం నేల నుంచి ఉత్పత్తిచేసిన వస్తువులలో నుంచి ఖర్చు చేయండి. వాటిలోని చెడు (నాసిరకం) వస్తువులను ఖర్చుపెట్టే సంకల్పం చేసుకోకండి- మీరు స్వయంగా వాటిని తీసుకోరు. ఒకవేళ కళ్లు మూసుకొని ఉంటే అది వేరే విషయం. అల్లాహ్ అక్కరలేనివాడు, సర్వస్తోత్రములకు అర్హుడని తెలుసుకోండి
[268] షైతాన్ మీకు దారిద్య్రం గురించి భయపెడతాడు. నీతిమాలిన పనులకై పురికొల్పుతాడు. కాగా; అల్లాహ్ మిమ్మల్ని క్షమిస్తాననీ, అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అల్లాహ్ గొప్ప ఉదార స్వభావుడు, అన్నీ తెలిసినవాడు
[269] ఆయన తాను కోరిన వారికి విజ్ఞతా వివేచనలను ప్రసాదిస్తాడు. ఎవరికి విజ్ఞతా వివేచనలు వొసగబడ్డాయో అతనికి ఎన్నో మేళ్లు వొసగబడినట్లే. హితబోధను బుద్ధిమంతులు తప్ప మరొకరు గ్రహించరు
[270] మీరు (దైవమార్గంలో) ఎంత ఖర్చు చేసినా, ఏ మొక్కుబడి చేసుకున్నా అల్లాహ్కు దాని గురించి పూర్తిగా తెలుసు. దుర్మార్గులకు సహాయం చేసే వారెవరూ లేరు
[271] ఒకవేళ మీరు బహిరంగంగా దానధర్మాలు చేసినా మంచిదే గాని, గోప్యంగా నిరుపేదలకు ఇస్తే అది మీ కొరకు ఉత్తమం. (దీనివల్ల) అల్లాహ్ మీ పాపాలను తుడిచిపెడతాడు. అల్లాహ్కు మీరు చేసేదంతా తెలుసు
[272] (ఓ ప్రవక్తా!) వారిని సన్మార్గంపై తెచ్చి నిలబెట్టే బాధ్యత నీపై లేదు. వాస్తవానికి సన్మార్గ భాగ్యాన్ని అల్లాహ్ తాను కోరిన వారికి అనుగ్రహిస్తాడు. మీరు దైవ మార్గంలో ఏ మంచి వస్తువును వ్యయపరచినా, దాని లాభాన్ని స్వయంగా మీరే పొందుతారు. కాకపోతే మీరు కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే ఖర్చు చేయాలి. మీరు ఎంత ఖర్చుచేసినా దాని పూర్తి ప్రతిఫలం మీకు ఇవ్వబడుతుంది. మీకు ఎంతమాత్రం అన్యాయం జరగదు
[273] దైవమార్గంలో నిమగ్నులైన కారణంగా , (బ్రతుకు తెరువు కోసం) భూమిలో సంచరించే వీలులేని నిరుపేదలు వాస్తవానికి మీ ధన సహాయానికి అర్హులు. వారి నిజస్థితిని గురించి తెలియనివారు, (ఆత్మాభిమానం వల్ల) వారెవరినీ అడగకపోవటం చూసి, వారిని అవసరాలు లేనివారుగా తలపోస్తారు. మీరు వారి వాలకాన్ని చూసి వాస్తవస్థితిని ఊహించవచ్చు. తమకు సహాయం చెయ్యమంటూ వారు ప్రజల వెంటపడరు. (అటువంటి త్యాగధనుల సహాయార్థం) మీరు ఎంత సొమ్ము వెచ్చించినా, నిశ్చయంగా దాని గురించి అల్లాహ్కు తెలుసు
[274] ఎవరయితే తమ సిరిసంపదలను రేయింబవళ్లు రహస్యంగానూ, బహిరంగంగానూ ఖర్చుచేస్తారో వారి కొరకు వారి ప్రభువు వద్ద (గొప్ప) పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు
[275] వడ్డీ సొమ్ము తినేవారు షైతాను పట్టటంవల్ల ఉన్మాది అయినవాని లాగానే నిలబడతారు. వారికీ దుర్గతి పట్టడానికి కారణం “వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే కదా!” అని వారు అనటమే. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి, వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభువు వద్దనుంచి వచ్చిన హితబోధను విని వడ్డీని మానుకున్నాడో, అతడు గతంలో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు. అతని వ్యవహారం దైవా ధీనం. ఇకమీదట కూడా దీనికి పాల్పడినవారే నరకవాసులు. వారు కలకాలం అందులో పడి ఉంటారు
[276] అల్లాహ్ వడ్డీని హరింపజేస్తాడు, దానధర్మాలను పెంచుతాడు. మేలును మరిచేవారిని, పాపిష్టులను అల్లాహ్ సుతరామూ ప్రేమించడు
[277] విశ్వసించి (సున్నత్ ప్రకారం) సత్కార్యాలు చేసేవారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాత్ను చెల్లించేవారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, చీకూ చింతగానీ ఉండవు
[278] ఓ విశ్వసించినవారలారా! అల్లాహ్కు భయపడండి. మీరు నికార్సయిన విశ్వాసులే అయినట్లయితే మిగిలి వున్న వడ్డీని విడిచి పెట్టండి
[279] ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధంకండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరూ ఒకరికి అన్యాయం చేయకూడదు. మీకు కూడా అన్యాయం జరుగకూడదు
[280] ఒకవేళ రుణగ్రస్తుడు యిబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడేవరకూ అతనికి గడువు ఇవ్వాలి. లేదా మన్నించి దానంగా వదలి పెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు శ్రేయోదాయకం
[281] మీరు అంతా అల్లాహ్ వైపుకు మరలింపబడే రోజుకు భయపడండి. ఆ తర్వాత ప్రతి ఒక్కరికీ తాను చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం వొసగబడుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు
[282] ఓ విశ్వాసులారా! మీరు పరస్పరం ఒక నిర్ణీత గడువు కొరకు అప్పు వ్యవహారం చేసుకుంటున్నప్పుడు దాన్ని (స్పష్టంగా) వ్రాసుకోండి. వ్రాసేవాడు ఈ వ్యవహారాన్ని మీ మధ్య న్యాయబద్ధంగా వ్రాయాలి. అల్లాహ్ ఎవడికైతే వ్రాయటం నేర్పాడో, అతను వ్రాయటానికి నిరాకరించకూడదు. అతడు వ్రాయాలి. రుణం పుచ్చుకున్న వ్యక్తి విషయాన్ని విడమరచి వ్రాయించాలి. ఈ విషయంలో అతను తన ప్రభువైన అల్లాహ్కు భయపడాలి. పుచ్చుకున్న దాన్ని తగ్గించి వ్రాయించకూడదు. ఒకవేళ రుణ గ్రహీత అమాయకుడో, బలహీనుడో, లేక చెప్పి వ్రాయించ లేనివాడో అయి ఉంటే అతని సంరక్షకుడు న్యాయంగా వ్రాయించాలి. మీలో ఇద్దరు పురుషులను ఈ వ్యవహారానికి సాక్షులుగా పెట్టుకోండి. ఇద్దరు పురుషులు లభ్యం కానిపక్షంలో మీరిష్టపడే సాక్షులలో ఒక పురుషుణ్ణి, ఇద్దరు స్త్రీలను సాక్షులుగా పెట్టుకోండి. ఎందుకంటే వారిలో ఒకామె మరచిపోతే, రెండవ స్త్రీ మరచిపోయిన ఆమెకు జ్ఞాపకం చేయవచ్చు. సాక్ష్యం కోసం పిలువబడినప్పుడు సాక్షులు రావటానికి నిరాకరించకూడదు. నిర్ణీతకాలం కొరకు తీసుకునే అప్పు, చిన్నదైనా పెద్దదైనా దాన్ని వ్రాసుకోవటంలో మాత్రం అశ్రద్ధ చేయరాదు. అల్లాహ్ దృష్టిలో ఈ పద్ధతి ఎంతో న్యాయవంతమైనది. ఇది సాక్ష్యాన్ని స్థిరంగా ఉంచుతుంది. సందేహాలకు, (అపార్థాలకు) లోనుకాకుండా ఉండేందుకు కూడా ఇది బాగా దోహదపడుతుంది. ఒకవేళ మీ మధ్య జరిగే వ్యవహారం అప్పటికప్పుడు తేలిపోయే వ్యాపార లావాదేవీలదైతే అట్టి పరిస్థితిలో దాన్ని వ్రాసుకోకపోయినా ఫరవాలేదు. కాని క్రయ విక్రయాల సందర్భంగా కూడా సాక్షులను ఉంచుకోండి. దస్తావేజు వ్రాసేవారిని గానీ, సాక్షులను గానీ ఇరకాటంలో పెట్టరాదు (అని తెలుసుకోండి). ఒకవేళ మీరు గనక అలాచేస్తే అది నియమోల్లంఘన క్రిందికి వస్తుంది. అల్లాహ్కు భయపడండి. అల్లాహ్ మీకు (పద్ధతిని) నేర్పుతున్నాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు
[283] ఒకవేళ మీరు ప్రయాణంలో ఉండి, వ్రాసేవాడు దొరక్క పోతే వస్తువును తాకట్టుగా పెట్టండి. ఒకరికి మరొకరి పట్ల నమ్మకం ఏర్పడినట్లయితే, తనను నమ్మి ఇచ్చిన అమానతును అతను వాపసు చేయాలి. ఇంకా అతను తన ప్రభువైన అల్లాహ్కు భయపడుతూ మసలుకోవాలి. మీరు సాక్ష్యాన్ని దాచకండి. సాక్ష్యాన్ని దాచేవాని హృదయం పాపభూయిష్టమైనది. మీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు
[284] ఆకాశాలలో, భూమిలో ఉన్న ప్రతి వస్తువూ అల్లాహ్దే. మీ మనసులలో ఉన్న దాన్ని మీరు వెల్లడించినా లేక దాచిపెట్టినా అల్లాహ్ మీ నుండి దాని లెక్క తీసుకుంటాడు. ఆ తరువాత ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాహ్కు అన్నింటిపై అధికారం ఉంది
[285] తన ప్రభువు తరఫున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా (సత్యమని నమ్మారు). వారంతా అల్లాహ్ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. “మేము ఆయన (పంపిన) ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను, భేదభావాన్నీ పాటించము” (అని వారు చెబుతారు). “మేము విన్నాము. విధేయులం అయ్యాము. మా ప్రభూ! మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము. కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే” అని అంటారు
[286] అల్లాహ్ ఏ ప్రాణిపైనా దాని శక్తికి మించిన భారం వేయడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవి చూస్తుంది. (ఇలా ప్రార్థిస్తూ ఉండండి): “ఓ మా ప్రభూ! మేము మరచిపోయినా, లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు. మా ప్రభూ! మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. మా ప్రభూ! మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదలిపెట్టు. మాకు క్షమాభిక్ష పెట్టు. మాపై దయజూపు. నీవే మా సంరక్షకుడవు. అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు.”